విశాఖ జిల్లాలో మావోయిస్టు అమరుల వారోత్సవాలు ఉద్రిక్తతల నడుమ ముగిశాయి. సోమవారం మందుపాతర పేలి ఇద్దరు పశువుల కాపర్లు మృతి చెందారు. వారోత్సవాలు సందర్భంగా ఆందోళనతో ఉన్న సరిహద్దు ప్రజలు ఊహించినట్లుగానే ఇద్దరు గిరిజనులు బలయ్యారు. పోలీసులు, మావోయిస్టుల ఆధిపత్య పోరులో రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ప్రతి ఏటా జులై 28 నుంచి ఆగస్టు 3 వరకూ మావోయిస్టు అమరుల వారోత్సవాలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది వారోత్సవాలు ముందు నుంచే సరిహద్దుకు అగ్రనేతలు తరలివచ్చారు. ఈ క్రమంలో వీరిని పట్టుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మూడుసార్లు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల నుంచి అగ్రనేతలు తప్పించుకోగా.. మావోయిస్టులు కొంతమందికి గాయాలైనట్లు తెలుసుకున్న పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు పలుచోట్ల మందుపాతరలు అమర్చారు. వారోత్సవాల ముందు పోలీసులే లక్ష్యంగా పెట్టిన మందుపాతరలు పేల్చగా.. పోలీసులు తృటిలో తప్పించుకున్నారు. అదే విధంగా గుజ్జెడి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల అనంతరం.. రెండు మందుపాతరలు నిర్వీర్యం చేశారు.
పది రోజుల ముందుగానే..
వారోత్సవాలకు పది రోజుల ముందు నుంచే మావోయిస్టులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వారం రోజులపాటు వర్షాలు అధికంగా ఉండడం, పోలీసుల నిర్బంధం ఎక్కువగా ఉండడం వల్ల మారుమూల గ్రామాల్లో స్థూపాలను నిర్మించినట్లు తెలుస్తోంది. సమీప గ్రామ ప్రజల భాగస్వామ్యంతో వారోత్సవాలు నిర్వహించినప్పటికీ బయటకు మాత్రం తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో బాగంగానే కటాఫ్ ఏరియాలోని పలు ప్రాంతాల్లో అమరుల పేరిట భారీ స్థూపం నిర్మించి అమరువీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదీ చూడండి..