పండగ కోసం ఇంటికి వచ్చిన జవానును లారీ బలి తీసుకుంది. ఈ విశాఖ జిల్లా ఘటన సబ్బవరం మండలం బాటజంగాలపాలెం (కొత్త టోల్గేట్) వద్ద అనకాపల్లి-ఆనందపురం రహదారిపై జరిగింది. ప్రమాదంలో ఆర్మీ జవాను గొర్లె శంకరరావు (34) దుర్మరణం పాలయ్యాడు. శంకరరావు శనివారం రాత్రి మర్రిపాలెం నుంచి బాట జంగాలపాలెం వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శంకరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. పోలీసులు సబ్బవరం ప్రాంతంలో లారీని గుర్తించి డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.
కుటుంబానికి అతనే ఆధారం..
బాటజంగాలపాలేనికి చెందిన గొర్లె శంకరరావు ప్రస్తుతం అసోం సమీపంలోని మొబైల్ వింగ్లో జవానుగా పని చేస్తున్నారు. పండగ కోసమని 10రోజులు సెలవు తీసుకుని మూడు రోజుల కిందట స్వగ్రామం వచ్చారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తల్లి గొర్లె లక్ష్మి, తాత అప్పలనాయుడు, నాయనమ్మ కర్రిమ్మ, తమ్ముడు మణిరాజు గుండెలవిసేలా రోదించారు. వీరంతా అతని సంపాదన మీదే బతుకుతున్నారు. ఇపుడు తమ భవిష్యత్తు ఏమిటని ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చూడండి. ప్రమాదమని తెలిసినా... ప్రాణాలకు తెగించి మరీ..!