ప్రకాశం జిల్లా రావినూతలకు చెందిన వ్యక్తికి నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో కొరిశపాడు మండల కార్యాలయంలో అధికారులతో ప్రకాశం జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రావినూతలో ప్రాథమిక, ద్వితీయ కాంటాక్ట్ వ్యక్తులను త్వరితగతిన గుర్తించాలని కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులకు సూచించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి నివసించిన గ్రామాన్ని మూడు జోన్లుగా విభజించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామానికి ఉన్న అన్ని దారులను మూసేసి అత్యవసర సేవలకు ఒక దారి మాత్రమే వినియోగించాలన్నారు. వ్యక్తులు, వాహనాల రాకపోకలపై నిఘా ఉంచాలని కలెక్టర్ చెప్పారు. రావినూతలకు ఏడు కిలో మీటర్ల పరిధిలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని.. రెడ్ జోన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామంలోని వారికి నిత్యావసరాలు వారి ఇళ్ల వద్దకే వాలంటీర్ల ద్వారా పంపాలన్నారు. సమావేశంలో ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్రెడ్డి, జడ్పీ సీఈవో కైలాస్ గిరీశ్వర్, డీఎంహెచ్వో అప్పలనాయుడు, ప్రత్యేక అధికారి లక్ష్మీదుర్గ, ఎంపీడీవో సాయికుమారి, తహసీల్దార్ చంద్రావతి, సీఐ అశోక్వర్ధన్, ఎస్సై మల్లికార్జున, వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఇది చదవండి యర్రగొండపాలెంలో నిత్యావసరాల పంపిణీ