Repalle Rape Case: ఒంగోలులో హోం మంత్రి తానేటి వనిత వాహన శ్రేణిని (కాన్వాయ్) అడ్డుకున్న కేసులో పోలీసు నిర్బంధంలో ఉన్న ఇద్దరు తెదేపా మహిళలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రేపల్లె రైల్వే స్టేషన్లో అత్యాచారానికి గురైన మహిళను పరామర్శించేందుకు సోమవారం జీజీహెచ్కు వెళ్తున్న మంత్రులు వనిత, ఆదిమూలపు సురేష్, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కాన్వాయ్ను తెదేపా మహిళా నాయకురాళ్లు అడ్డుకున్నారు. వారిలో కొక్కిలగడ్డ లక్ష్మి, కేశన శేషమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఒంగోలు ఒకటో పట్టణ స్టేషన్కు తరలించారు. నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి చెందిన కుమ్మూరి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో తెలుగు మహిళలపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. మహిళలను రాత్రిపూట నిర్బంధించకూడదనే నిబంధనను పట్టించుకోకుండా ఇద్దరినీ స్టేషన్లోనే ఉంచారు. వారు కేసులో నిందితులని.. అరెస్టు చేసినందున నిర్బంధంలో ఉంచినట్లు పోలీసులు చెప్పారు.
అరెస్టయిన తెలుగు మహిళలకు నైతికస్థైర్యం కల్పించేందుకు ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కె.శ్రీనివాసరావు, కార్పొరేటర్లు వేమూరి అశ్విని, అంబూరి శ్రీను, టి.రవితేజ, నగర పార్టీ అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, బండారు మోహన్, బెజవాడ మురళి తదితర 30 మంది తెదేపా నాయకులు రాత్రంతా పోలీసుస్టేషన్ ఆవరణలోనే జాగారం చేశారు. ఆ మహిళలను మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ఆ తర్వాత రెండో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. జూమ్ ద్వారా మేజిస్ట్రేట్ పి.గాయత్రి వారిని విచారించారు. అనంతరం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
గంటల వ్యవధిలోనే: ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిత్యం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధకచట్టం కేసులు నమోదవుతూనే ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై స్థాయి అధికారులు కేసు నమోదు చేసినా దర్యాప్తు మాత్రం డీఎస్పీ స్థాయి అధికారి నిర్వహించాలి. నేర స్థలాన్ని స్వయంగా పరిశీలించాలి. అక్కడ ఫిర్యాది, ముద్దాయిలతో పాటు ప్రత్యక్ష సాక్షులను స్వయంగా విచారించాలి. విచారణ ప్రక్రియ మొత్తాన్నీ వీడియో చిత్రీకరించాలి. అభియోగాలు నిజమని తేలితే అరెస్టు చేస్తారు. లేకపోతే తప్పుడు కేసుగా నిర్ధారిస్తారు. ఒక్కో కేసు విచారణకు డీఎస్పీలు వారం నుంచి మూడు వారాలు సమయం తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఒంగోలు కేసులో మాత్రం.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే విచారణ జరిపి నేరాన్ని నిర్ధారించి మహిళలను అరెస్టు చేశారు.
కుట్రకోణం ఉంది: హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్ అడ్డగింతలో కుట్రకోణం దాగి ఉందని అనుమానిస్తున్నట్లు డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. ఒంగోలు జీజీహెచ్ వద్ద ఆయన మంగళవారం మాట్లాడుతూ... ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా, ప్రణాళిక ప్రకారం సోమవారం కాన్వాయ్ను అడ్డుకున్నారని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే 17 మంది నిందితులను గుర్తించామని.. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
తెదేపా సాయం: రేపల్లెలో అత్యాచారానికి గురై ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలికి తెదేపా తరఫున రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి మంగళవారం ఆసుపత్రికి వెళ్లి బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి సాయం అందించారు. తొలుత ఎమ్మెల్యే రాకకు పోలీసు అధికారులు అభ్యంతరం తెలిపారు. కలెక్టర్తో మాట్లాడిన ఆర్డీవో అనంతరం ఆసుపత్రికి దగ్గరకు చేరుకొని ఎమ్మెల్యేను అనుమతించారు.
ఇదీ చదవండి: ఏడాదికి ఒకసారైనా సీఎంతో భేటీకి ప్రయత్నిస్తా: మంత్రి విశ్వరూప్