నెల్లూరు జిల్లాలో రబీ సీజన్లో సోమశిల, కండలేరు జలాశయంలలో నీరు సమృద్ధిగా ఉండటంతో రైతులు లక్షలాది ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం వరి నూర్పిడిలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వస్తుందో? రాదోనని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మర్రిపాడు, కలువాయి మండలాలలో రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. రైతులు ధాన్యం నూర్పుళ్లు చేసి.. అమ్ముకోలేక రోడ్లపై పోసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అసలు కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. దళారులు మాత్రం తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోయారు.
వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టామని... కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కౌలు కట్టలేని దుర్భర పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: పంటలను కొనేవారే కరువయ్యారు..!