నెల్లూరు జిల్లాలో వరి కోత ముమ్మరంగా సాగుతోంది. ఒక వైపు ఎన్నికల పోరు.. మరో వైపు పంట కోతలతో గ్రామాల్లో రైతులు బిజీబిజీగా ఉన్నారు. అభ్యర్థులు ప్రచారాల్లో తిరుగుతుంటే, రైతులు పొలాల్లో ధాన్యం నూర్పిళ్లు చేస్తున్నారు. జిల్లా అధికారులు కొందరు ఎన్నికలు విధుల్లో ఉంటే మరి కొందరు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అధికారుల హడావిడి కనిపిస్తోంది.
రైతు వద్దకే కొనుగోలు కేంద్రాలు:
నెల్లూరు జిల్లాలో రబీ సాగు అత్యధికంగా ఉంటుంది. అధికారికంగా 5.50లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అనధికారికంగా మరో మూడు లక్షల ఎకరాలు సాగు జరుగుతోంది. ఈ దిగుబడులను కొనుగోలు చేయడం కష్టంగా మారింది. గత ఏడాది గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సారి ఆ పరిస్థితి లేకుండా చూస్తామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు హామీ ఇచ్చారు. గత ఆరు నెలలుగా పక్క ప్రణాళికను తయారు చేశామన్నారు. వ్యవసాయ శాఖ, రెవిన్యూ, డీఆర్టీఏ సిబ్బంది సమన్వయంతో కొనుగోళ్లు ప్రారంభించారు. రైతు వద్దకే కొనుగోలు కేంద్రాలు అనే విధంగా జిల్లాలోని 666 రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకుంటున్నారు.
రైతు ఖాతాకే నేరుగా నగదు:
రైతులు అందరూ విధిగా ఈ-క్రాప్లో నమోదు కావాలని సూచిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులకు డబ్బు నేరుగా బ్యాంక్ అకౌంట్కే జమయ్యేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర దక్కేలా వీఏఏలకు బాధ్యతలు అప్పగించామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బాలకృష్ణారావు పేర్కొన్నారు.
సిబ్బందికి శిక్షణ:
కొనుగోలు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. మే చివరి వరకు కేంద్రాలు నడిచేలా చర్యలు తీసుకుంటున్నారు. దళారులకు విక్రయించి నష్టపోవద్దని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: