ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేయనున్న వైఎస్ఆర్ రైతుభరోసా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జగన్ సీఎం అయిన తరువాత మొదటిసారి నెల్లూరు జిల్లాకు రానున్నారు.
మంత్రి అనిల్కుమార్ యాదవ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు వారం రోజులుగా సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అన్ని నియోజవర్గాల నుంచి రైతులు, జన సమీకరణకు చర్యలు చేపట్టారు. జిల్లా నుంచి 50వేల మంది రైతులు ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. సభావేదికను అందంగా తీర్చిదిద్దారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు.
ముఖ్యమంత్రి జగన్ 15వ తేదీ ఉదయం 9.30గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.15కి రేణిగుంట చేరుకుంటారు. 10.30కి ప్రత్యేక హెలికాప్టర్లో కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీకి బయల్దేరుతారు. అక్కడకు చేరుకున్న తర్వాత ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలిస్తారు. 11.30గంటలకు సభావేదికకు చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన అనంతరం 1.30గంటలకు హెలికాప్టర్లో గన్నవరం బయల్దేరుతారు.
ఇదీ చదవండీ... రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు..నవంబర్ 1 నుంచి అమలు