నెల్లూరు జిల్లా కావలి పురపాలక సంఘం జనాభా 1.20లక్షలు. 40వార్డులు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చి చేరడంతో పురపాలక సంఘం విస్తీర్ణం పెరిగింది. దీనివల్ల తాగునీటి సమస్య పెరిగింది. వెంగళ్రావునగర్, తుఫాన్ నగర్, బాలకృష్ణారెడ్డి నగర్, ఇస్లాంపేట, ఇంద్రానగర్, వైకుంఠపురం కాలనీల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కుళాయిలూ లేవు. ప్రజలు ఐదేళ్లుగా తాగునీటి కోసం తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.
2017లో ప్రారంభం.... 70శాతం పూర్తి...!
గత ప్రభుత్వం పెరిగిన జనాభాకు అనుగుణంగా కావలి మంచినీటి పథకం నిర్మాణం 2017లో చేపట్టింది. అమృత పథకం నుంచి రూ.59 కోట్లు నిధులు సైతం మంజూరు చేయించింది. బిల్లులు చెల్లించకపోవటంతో... గత ఏడాది నుంచి గుత్తేదారులు పనులు నిలిపివేశారు. ఇంకా 30శాతం పనులు మిగిలి ఉన్నాయి.
వేధిస్తున్న నిధుల కొరత...!
ప్రజారోగ్యశాఖ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో మంచినీటి పథకం పనులు జరుగుతున్నాయి. 2036 నాటికి పెరిగిన జనాభాను ఉద్దేశించి దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తోన్న నీరు ఏ మాత్రం చాలడంలేదు. అమృత పథకంలో రోజుకు 34 ఎంఎల్డీల నీటిని కుళాయిల ద్వారా అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. సోమశిల నుంచి చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 80 కిలోమీటర్లు పైప్లైన్లను నిర్మించారు. ఇప్పటి వరకూ పనులు 70 శాతం పూర్తయ్యాయి. సమ్మర్ స్టోరేజి ట్యాంకు నిర్మాణం సైతం పూర్తయ్యింది. గుత్తేదారు రూ.35 కోట్లు విలువైన పనులు చేశారు. సుమారు రూ.20 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. నిధులు సమస్య కారణంగా పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి. మొత్తం 16 మంచి నీటి రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంది. అందులో ఆరు రిజర్వాయర్లు ఇంకా పూర్తి కాలేదు. నిధులు మంజూరు అయితే జూన్ నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: