UTF Leaders Relay Deeksha Updates: 'సీపీఎస్ విధానం వద్దు-పాత పెన్షన్ విధానమే ముద్దు' అనే నినాదంతో ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నేతలు నిరవధిక దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు 18వ తేదీన రాష్ట్ర యూటిఎఫ్ కేంద్రాల్లో, 19వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరవధిక దీక్షలు చేపట్టిన నేతలు.. 20వ తేదీన (శుక్రవారం) ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, అల్లూరి సీతరామరాజు జిల్లాలోని తాలూకా, డివిజన్ కేంద్రాల్లో నిరవధిక దీక్షలు చేపట్టారు.
NTR District: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి.. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో యూటీఎఫ్ నాయకులు రిలే దీక్షలు ప్రారంభించారు. సీపీఎస్, జీపీఎస్ విధానాలను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీపీఎస్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఉద్యోగులు నష్టపోతున్నారని వాపోయారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
Prakasam District: సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరుతూ.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. అధికారంలోకి వస్తే సీపీఎస్ను రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్.. ఉద్యోగులను మోసం చేసి జీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చారని దుయ్యబట్టారు. సీపీఎస్ కంటే జీపీఎస్ చాలా అన్యాయమైందని ఆగ్రహించారు. వెంటనే సీఎం జగన్ స్పందించి జీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.
Sri Sathya Sai District: పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలో భాగంగా సీపీఎస్ను, జీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను తీసుకురావాలని నినాదాలు చేశారు.
Srikakulam District: పాత పెన్షన్ విధానాన్ని సాధించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని.. శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయులు తేల్చి చెప్పారు. జీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలంటూ.. కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిబాపూలే పార్క్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ పోరాటంపై ప్రభుత్వం స్పందించకపోతే.. రాబోయే ఎన్నికల్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేవారికే.. ఓట్లు వేస్తామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
యూటీఎఫ్ 'సంకల్ప దీక్ష' భగ్నం.. ఉపాధ్యాయుల ఆందోళన
Alluri Sitarama Raju District: సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు చుక్క సనాతన బాబు డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటమి తథ్యమన్నారు. తమ సమస్యను పరిష్కరించేంతవరకూ నిరవధిక దీక్షలు కొనసాగుతూనే ఉంటాయన్నారు.
''జీపీఎస్, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తుంటే.. ప్రభుత్వం ఆ దీక్షలను భగ్నం చేసి అరెస్టు చేస్తోంది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారికి సంఘీభావంగా ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. జీపీఎస్ అనేది కొత్త సీసాలో పాత సారా లాంటిది. జీపీఎస్ చట్టంతో సీపీఎస్ ఉద్యోగులను తీవ్రంగా మోసగించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జీపీఎస్ చట్టం తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు మరణ శాసనం విధించింది.''-యూటీఎఫ్ నాయకులు