Chittinagar tunnel in Vijayawada has become dangerous: విజయవాడ సొరంగ మార్గంలో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు. తరుచూ ప్రమాదాలు జరగడంతో రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో అవకాశం లేకపోవడంతో ఈ రహదారి గుండే ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు. వర్షం పడితే ఈ రహదారిలో ప్రయాణించడం నరకాన్ని తలపిస్తోంది. సొరంగ మార్గానికి ఆనుకొని గృహాలు ఉండటంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని.. ప్రజలు భయపడుతున్నారు. సొరంగంలో కొన్ని చోట్ల వర్షపునీరు కారుతుండటంతో.. ఆ సమయంలో వాహనదారులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు.
లక్ష మందికిపైగా కొండప్రాంతంలో నివాసం.. వర్షాకాలం వచ్చిందంటే కొండ ప్రాంత వాసులకు దడపుడుతోంది. ఎప్పుడు ఏ కొండచరియలు విరిగిపడి ప్రమాదం జరుగుతుందోనని.. ఆందోళనతో కొండప్రాంత నివాస ప్రజలు భయపడుతున్నారు. ఇళ్ల ముంగిట ప్రహరీలు కూలిపోతాయనే భయం ప్రజలను ప్రతి రోజూ వెంటాడుతూనే ఉంటోంది. విజయవాడ పశ్చిమంలో భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో కొండ ప్రాంతం ఉండటంతో వాటిపై ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. మెట్లు, తాగు నీరు, విద్యుత్తు సౌకర్యాలు గత ప్రభుత్వాలు కల్పించడంతో సుమారు లక్ష మందికిపైగా కొండప్రాంతంలో నివాసముంటున్నారు. చిన్నపాటి వర్షానికి సైతం బిక్కుబిక్కుమంటూ బతకెళ్లదీస్తున్నారు. ప్రధానంగా చిట్టినగర్ సొరంగ ప్రాంతం విద్యాధరపురం, భీమనవారిపేట, ప్రైజర్పేట, గొల్లపాలెంగట్టు, కబేళా సెంటర్, తదితర ప్రాంతాల్లో రక్షణ చర్యలు అవసరమైనా విజయవాడ నగర పాలక సంస్థ ఆ దిశగా ఆలోచన చేయడం లేదు.
భయంతో రహదారి గుండా రాకపోకలు.. సొరంగ మార్గం గుండా నిత్యమూ వేలాది మంది ప్రజలు, వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారు. కొండకు అంచున ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని నిత్యమూ ఆందోళన చెందుతూనే జీవనం సాగిస్తుంటారు. వర్షాకాల సమయంలో గతంలో కొండరాళ్లు జారిపడి చోదకులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రమాదాలకు జరగడంతో వాహనాలు దారులు గాయపడడంతో పాటు వాహనాలు దెబ్బతింటున్నాయి. సొరంగానికి ఇరువైపులా కొండరాళ్లు పొరలు పొరలుగా ఉన్నాయి. ఇవి వర్షానికి కింద పడుతున్నాయి. నానిపోయి ఎప్పుడు ఊడిపోతాయోననే భయం ఈ రహదారి గుండా రాకపోకలు సాగించే ప్రజలను వెంటాడుతోంది.
మరమ్మతులు చేయడంలో జాప్యం.. కొండకు రెండు వైపులా గ్రౌటింగ్, రివిటింగ్, ఇనుప మెస్తో రక్షణ వలయం ఏర్పాటు చేసేందుకు 84 లక్షల రూపాయల నిధులకు విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్లో ఆమోదించింది. ఆమోదించి నెలలు గడుస్తున్నా ఆచరణకు నోచుకోలేదు. దీంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. సొరంగ మార్గం మరమ్మతులు చేయడంలో వీఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధుల జాప్యం ప్రదర్శిస్తున్నారని.. ఈ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.