కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం పచ్చదనంతో నిండిపోయింది. ఈ కార్యాలయంలో రెండెకరాల ఖాళీ స్థలం ఉంది. 2018 వరకు కనీసం ప్రహరీ కూడా లేదు. ఎవరూ పట్టించుకోలేదు. ఇక్కడంతా పాడుబడిన వాతావరణం కనిపించేది. 2018 జనవరిలో బదిలీపై ఫైర్ స్టేషన్ ఆఫీసర్గా మోహన్ బాబు ఇక్కడికి ఇక్కడకు వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
కార్యాలయాల స్థలంలో మొక్కల పెంపకం
కార్యాలయంలోని రెండెకరాల స్థలంలో మొక్కలు పెంచాలని అగ్నిమాపక అధికారి మోహన్ బాబు భావించారు. పై అధికారుల అనుమతితో.. పచ్చదనానికి శ్రీకారం చుట్టారు. కార్యాలయంలో మొత్తం 15మంది అధికారులు విధులు నిర్వహిస్తుండగా.. వారి సహకారంతో ఆకు కూరలు, కూరగాయలు, పండ్ల చెట్లు, పూల మొక్కలు వేశారు. కార్యాలయం చుట్టూ రెండు ఎకరాల స్థలాన్ని సంరక్షించుకునేందుకు గచ్చకాయల మొక్కలతో బయో ఫెన్సింగ్ వేశారు. మొక్కలన్నీ పెరిగి పెద్దయ్యాయి. సిబ్బంది కుటుంబ అవసరాలకు సరిపోయేలా.. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పండుతున్నాయి. దీనిపై సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కూరగాయలు, పండ్లు పెంచుతున్న సిబ్బంది
ఈ ప్రాంగణంలో.. టమాటా, పచ్చిమిర్చి, బెండకాయ, కాకరకాయ, కరివేపాకు, ఆకుకూరలు, జామ, మామిడి, సీతాఫలం, సపోటా సహా వివిధ రకాల పూల మొక్కలు పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇక్కడి సిబ్బంది సైతం.. కలుపు తీస్తూ, నీరు పెడుతూ పంటలు పండిస్తున్నారు. అగ్నిమాపక శాఖ భవనానికి సైతం మరమ్మతులు చేయించి.. రంగులు వేయించారు. ప్రస్తుతం ప్రాణవాయువు సమృద్ధిగా లభిస్తోందని.. కరోనా అధికంగా ఉన్న సమయంలోనూ ఎవ్వరు కరోనా బారిన పడలేదని సిబ్బంది చెబుతున్నారు.
కార్యాలయాల్లో విలువైన స్థలాలను వృథాగా వదిలేయకుండా.. పచ్చదనాన్ని పెంచుకోవటం ద్వారా మానసిన, శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చని నిరూపిస్తున్నారు, ఎమ్మిగనూరు అగ్నిమాపక సిబ్బంది.
ఇదీ చదవండి: పుట్టుకతోనే అంధత్వం.. అయినా ఐఏఎస్లో ర్యాంకు