మొన్నటి వరకూ అమరావతిని భ్రమరావతి అన్న జగన్... నిజాలు ప్రపంచానికి తెలిసాక కొత్త పాట మొదలుపెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబు ఖర్చు చేసింది 5 వేల కోట్లేనని... రాజధాని అభివృద్ధి కోసం లక్ష కోట్లు కావాలి అంటూ ముఖ్యమంత్రి కొత్త డ్రామా షురూ చేసారంటూ విమర్శించారు. 28-జూన్-2019న ఏపీ సీఆర్డీఏపై వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో 9,165 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి ఖర్చు చేసిందని చెప్పటాన్ని గుర్తు చేసారు. అమరావతి ఫైనాన్షియల్ ప్లాన్ గురించి 2019 ఫిబ్రవరిలో తెదేపా ప్రభుత్వం జీవో 50ను విడుదల చేయటాన్ని లోకేష్ ప్రస్తావించారు. అందులో అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.55,343 కోట్ల అని ఉండగా... ఇందులో రాబోయే ఎనిమిదేళ్లలో ఖర్చు పెట్టాల్సింది రూ,6,629 కోట్లన్న విషయాన్నీ స్పష్టం చేసారు. ప్రభుత్వానికి మిగిలిన ఖర్చంతా మిగిలిన భూమితో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ద్వారానే వస్తుందని వివరిస్తూ... అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలో చంద్రబాబు స్పష్టంగా చెప్పారన్నారు. ఇందుకు అమరావతికి సంబంధించి జీఓలను, సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పాత్రలను లోకేష్ తన ట్వీటర్కు జత చేసారు. విశాఖలో తన ల్యాండ్ మాఫియా అభివృద్ధి కోసం ఉన్న అమరావతిని చంపేసి కొత్త రాజధాని అంటున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'అప్పుడు మద్దతిచ్చి... ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు..?'