సైబర్ మోసాలలో ఒక్కసారి డబ్బు పోగొట్టుకొంటే పోలీసులు శక్తియుక్తులన్నీ వెచ్చించినా రికవరీ చేయడం దుస్సాధ్యంగా మారుతోంది. 2020లో ఒక్క విజయవాడ కమిషనరేట్ పరిధిలోనే 3కోట్ల 48లక్షల రూపాయలు ప్రజల నుంచి సైబర్ కేటుగాళ్లు కొల్లగొట్టారు. మొత్తం 173మంది మోసపోయారు. పోలీసులు 42లక్షల 98వేలు మాత్రమే రికవరీ చేయగలిగారు. అంటే వంద రూపాయలు పొగొట్టుకుంటే తిరిగొచ్చేది 12 రూపాయిలు మాత్రమే. సైబర్ నేరస్థుల ఖాతాల్లోని మరో 83 లక్షల 87వేలు స్తంభింపజేశారు. 2019లోనూ 2కోట్ల 30 లక్షలకు పైగా సొమ్మును సైబర్ చోరులు స్వాహా చేశారు. 62 లక్షల వరకూ రికవరీ చేయగలిగారు.
నేరస్థులు ఉత్తరాది రాష్ట్రాల్లో మకాం వేసి ఇక్కడి వారిని లక్ష్యంగా చేసుకుంటున్నందున వారిని వేటాడటమూ శక్తికి మించిన పనిగా మారుతోంది. రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాకు చెందిన పలువురు సైబర్ మోసాల్లో ఆరితేరగా... దిల్లీ కేంద్రంగా కాల్సెంటర్ మోసాలు, జాంతారా కేంద్రంగా ఓటీపీ, లాటరీ మోసాలు జరుగుతున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే బ్యాంకు ఖాతాల లావాదేవీలు, మోసగాళ్ల ఆనవాళ్లను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కనిపెడుతున్నారు. అయినా వారి దగ్గర నుంచి డబ్బు రికవరీ మాత్రం కష్టతరంగా మారింది. బాధితుల నుంచి కొల్లగొట్టిన సొమ్ము జమ కావడమే ఆలస్యం.. ఆన్లైన్ షాపింగ్ ద్వారా కూపన్లు, బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు కొనుగోళ్లు చేస్తూ నిందితులు తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఇళ్లు, స్థిరాస్తులు సైతం కూడబెట్టుకుంటున్నారు.
విజయవాడ కమిషనరేట్ పరిధిలో సైబర్ కేసులు నమోదవుతున్నా నిందితులను పట్టుకున్న దాఖలాలే లేవు. ఫిర్యాదు రాగానే ఎంతో కొంత రికవరీ అయితే చాలనే భావన నెలకొంది. కేటుగాళ్ల జాడ గుర్తించేందుకు కొన్ని సందర్భాల్లో రోజులు పడితే మరికొన్ని కేసుల్లో నెలలు కూడా పట్టొచ్చు. తీరా.. పట్టుకునేందుకు అక్కడికెళ్తే చిక్చొచ్చు.. చిక్కకపోవచ్చు. పది నుంచి పదిహేను రోజులు అక్కడే మకాం వేసినా ఫలితముండదు. ఉత్త చేతులతోనే తిరిగి రావాల్సి వస్తుంది.
కొన్ని సందర్భాల్లో నిందితుల దగ్గర నుంచి రాబట్టిన సొమ్ము కంటే.. వారిని పట్టుకునేందుకు అయ్యే ఖర్చే ఎక్కువ కావడంతో పోలీసులు ఆ దిశగా ఆలోచించడం లేదు. అలాగే సైబర్స్టేషన్లో ఉన్న సిబ్బందిలో 40 శాతం మంది నిత్యం ఏదో ఒక బందోబస్తు విధుల్లో ఉంటున్నారు. దీంతో సైబర్ నేరస్థుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి జగన్కు ఈడీ కోర్టు సమన్లు