రిటైల్ రంగంలో 2026 నాటికి రూ.5 వేల కోట్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 50 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో రిటైల్ రంగాన్ని ప్రోత్సహించడానికి అయిదేళ్ల పాటు అమలులో ఉండే ‘ఏపీ రిటైల్ పార్కు పాలసీ 2021-26’ని రూపొందించినట్లు తెలిపింది. పాలసీ మార్గదర్శకాలను ఖరారు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైల్ పార్కుల ఏర్పాటు ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, రిటైల్ వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
ప్రోత్సాహకాలు ఇవీ
- భూమి, భవనాలు, యంత్రాలు కలిపి రూ.100 కోట్ల పెట్టుబడి/ 5 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే వాటికి మెగా రిటైల్ పార్కు హోదా ఉంటుంది. మెగా రిటైల్ పార్కులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెచ్చించిన మొత్తంలో 50 శాతం వరకు తిరిగి పొందే అవకాశం.
- 5-10 వేల మందికి ఉపాధి కల్పిస్తే గరిష్ఠంగా రూ.3 కోట్లు
- 15 వేల మందికి ఉపాధి కల్పించే పార్కులకు రూ.4 కోట్లు
- 20 వేల మందికి ఉపాధి కల్పించే వాటికి రూ.5 కోట్లు
- మొదటి సారి నిర్వహించే లావాదేవీలపై 100 శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు
వెసులుబాట్లు ఇవీ
- రిటైల్ పార్కు డెవలపర్లకు అవసరమైన సూచనలు అందించేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రంలో ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ను నియమించాలి. అందులో రిటైల్ సంస్థల ఏర్పాటుకు సహకారాన్ని అందిస్తారు.
- సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేలా చర్యలు. ఆన్లైన్లోనే కార్మిక శాఖ, ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్లు, వ్యాపార లైసెన్సు, తదితర అనుమతులు అన్నీ ఇచ్చేలా సింగిల్ డెస్క్ పోర్టల్ ఏర్పాటుతోపాటు మరిన్ని వెసులుబాట్లు కల్పించింది.
క్యాపిటల్ బిజినెస్ పార్కుకు రాయితీలు
రిటైల్ పార్కు పాలసీ ఆధారంగా క్యాపిటల్ బిజినెస్ పార్కు సంస్థకు రాయితీలను ప్రకటిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తాడేపల్లిలో రిటైల్ పార్కు ఏర్పాటు ద్వారా రూ.194.16 కోట్లను సంస్థ పెట్టుబడితో పాటు 5 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో 900 టెక్స్టైల్ రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేస్తుంది. పార్కు వెలుపల మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయంలో రూ.3 కోట్లకు మించకుండా 50 శాతం వరకు ప్రోత్సాహకాల కింద అందించడంతోపాటు స్టాంపు డ్యూటీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
గ్రీన్టెక్కు ప్రోత్సాహకాలు
నెల్లూరులోని నాయుడుపేట సెజ్లోని గ్రీన్టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మెగా ప్రాజెక్టు కేటగిరిలో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించటానికి ప్రభుత్వం అనుమతించింది. అయిదేళ్లలో గరిష్ఠంగా రూ.3.75 కోట్ల విద్యుత్ రాయితీ, ఇతర ప్రోత్సాహకాలను అందించటానికి అనుమతించింది.ఈ సంస్థ రూ.627 కోట్ల పెట్టుబడులతో విస్తరించడం ద్వారా 2,200 మందికి ఉపాధి కల్పిస్తుంది.
నీల్కమల్కు కూడా...
కడపలోని కొప్పర్తి పారిశ్రామిక పార్కులో ఏర్పాటు చేయనున్న నీల్కమల్ లిమిటెడ్కు ‘వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్’ పాలసీ ప్రకారం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమ ఏర్పాటు కోసం 105 ఎకరాలను (ఎకరానికి రూ.10 లక్షలు) రాయితీ ధరపై కేటాయించింది.
- కరోనా వ్యాప్తి నేపథ్యంలో విశాఖలో నిర్మాణంలో ఉన్న సెయింట్ గోబియాన్ పరిశ్రమ మొదటి దశను పూర్తి చేసేందుకు 2022 జూన్ వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పిట్టి రైల్ ప్రాజెక్టుకు మెగా హోదాలో రాయితీ
కడప జిల్లా కొప్పర్తిలోని ఇండస్ట్రియల్ హబ్లో ఏర్పాటు కానున్న పిట్టి రైల్ అండ్ ఇంజినీరింగ్ కాంపొనెంట్స్ లిమిటెడ్కు ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2024 నాటికి 2 వేల మందికి ఉపాధి కల్పిస్తే స్థిర మూలధన పెట్టుబడి మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తుంది. పరిశ్రమ ఏర్పాటుకు ఎకరానికి రూ.10 లక్షల చొప్పున 117.85 ఎకరాలను కేటాయిస్తారు.
- చిత్తూరు జిల్లాలోని అమ్మయ్యప్పర్ టెక్స్టైల్స్ లిమిటెడ్కి కూడా ప్రత్యేక ప్యాకేజీ కింద రాయితీలు చెల్లించడానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జిందాల్కు 860 ఎకరాలు
నెల్లూరు జిల్లా తమ్మినపట్నం, మోమిడి గ్రామాల దగ్గర జిందాల్ సంస్థకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 860 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. భూములపై వెచ్చించే మొత్తం కాకుండా రూ.7,500 కోట్ల పెట్టుబడితో ఏటా 2.25 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను జిందాల్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. వచ్చే నాలుగేళ్లలో ప్రత్యక్షంగా 2,500 మందికి, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ పేర్కొంది. ఏపీఐఐసీ మార్గదర్శకాలకు అనుగుణంగా భూముల ధరను సంస్థ చెల్లించాలని, పునరావాసానికి, ఇతర ఖర్చులను సంస్థ భరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చూడండి. WATER DISPUTES: తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి...