పత్తి ధర భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ ధరతో పోల్చితే సీసీఐ మద్దతు ధర తక్కువగా ఉంది. ప్రస్తుత ఖరీఫ్లో సాగు గణనీయంగా తగ్గిపోవడం, పైరుకు తెగుళ్లు ఆశించి దిగుబడి తగ్గిపోవడం, నిల్వలు తక్కువగా ఉండటం ధరలు పెరగడానికి కారణమని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తగ్గిన సాగు విస్తీర్ణం
కృష్ణా జిల్లాలో ఈ ఖరీఫ్లో 95 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నూజివీడు నియోజకవర్గాల్లో పత్తి అధిక శాతం పండిస్తారు. గత ఏడాది 1.30 లక్షల ఎకరాల్లో వేశారు. గత ఏడాది తెగుళ్ల వల్ల దిగుబడులు తగ్గడం, ధర లేకపోవడంతో రైతులు నష్టపోయారు. మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా మిరప సాగు చేశారు. దీంతో సాగు తగ్గిపోయింది. వర్షాలు, తెగుళ్ల వల్ల పత్తి పైర్లు కొంత దెబ్బతిన్నాయి. ప్రస్తుతం తొలి విడత పత్తి తీసి రైతులు విక్రయిస్తున్నారు. వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో తీతలు ఆరంభమై రైతుల చేతికి పంట రానుంది.
క్వింటా రూ. 8500
పత్తి క్వింటా ధర ప్రధాన మార్కెట్లో రూ. 8 వేల నుంచి రూ. 8500 వరకు ఉండగా.. వ్యాపారులు గ్రామాల్లో రూ.7200 నుంచి రూ.7500 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మొదటి తీత కావడం వల్ల నాణ్యత తక్కువగా ఉంది. అయినప్పటికీ మార్కెట్లో డిమాండ్ వల్ల కొంటున్నారు. గత ఏడాది ఖరీఫ్లో తొలి తీత పత్తి క్వింటా కేవలం రూ.3500లకే కొన్నారు. అనంతరం నాణ్యత ఉంటే రూ. ఐదు వేల నుంచి రూ.5200 వరకు ఇచ్చారు. బయట మార్కెట్ తక్కువగా ఉండటంతో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఆశించారు. అందుకు భిన్నంగా ఈ ఖరీఫ్లో ధరలు ఉండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. సీసీఐ మద్దతు ధర క్వింటాకు రూ.6025 మాత్రమే. సీసీఐ కూడా మార్కెట్ ధరకు అనుగుణంగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
సంతోషంగా ఉంది
ధర బాగుండటం సంతోషంగా ఉంది. మొదటి విడత పత్తి తీయిస్తున్నాం. గతంలో ఎప్పుడూ ఈ ధర చూడలేదు. వర్షాల వల్ల దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.
నిల్వలు తగ్గినందునే..
మార్కెట్లో పత్తి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో పైర్లు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది సాగు తక్కువగా ఉండటంతో పత్తికి కొరత ఏర్పడింది. అందుకే ధర పెరిగింది.- దివ్వెల మల్లేశ్వరరావు, వ్యాపారి
ఇదీ చదవండి:
గంజాయి మొక్కను రాష్ట్ర చిహ్నంగా వైకాపా ప్రభుత్వం మార్చేసింది: పవన్ కల్యాణ్