కృష్ణా జిల్లావ్యాప్తంగా 2,71,706 మంది లబ్ధిదారులకు గృహయోగం కల్పించబోతున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. విజయవాడ, మచిలీపట్నం నగరపాలక సంస్థలతో పాటు... ఏడు పురపాలక, నగర పంచాయతీలు, 49 గ్రామీణ మండలాల్లో ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని నివేశన ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతంలో సెంటు, గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర చొప్పున లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఇందుకోసం 4,573.33 ఎకరాల భూమి అవసరం కాగా... 2498.38 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామన్నారు. మిగతా 1275.96 ఎకరాల పట్టాభూమిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.76 కోట్ల విలువైన భూములను జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసిందన్నారు. అందుకు సంబంధించిన రూ.62.86 కోట్లను ప్రజలకు అందజేశామని చెప్పారు.
ఈ కొనుగోలు వ్యవహారమంతా గ్రీన్ఛానల్ ద్వారా జరుగుతోందని, భూమి విక్రయించిన రైతుల ఖాతాల్లో నగదు నేరుగా పడుతోందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములతో కలిపి మొత్తం 1409 లేఅవుట్లను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి భూమి తీసుకున్న లబ్ధిదారులకు అవసరమైతే ఐదేళ్ల తరువాత అమ్ముకునే హక్కును ప్రభుత్వం కల్పిస్తోందని-నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. అసైన్డ్భూముల్లో పంటలు వేసినచోట తలెత్తే వివాదాలను సానుకూలంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఆయా ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలించి న్యాయం చేస్తున్నామని కలెక్టరు పేర్కొన్నారు.