అఖిల భారత గంగపుత్ర మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన వెంకటేశ్వర్లు.... బెస్త, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుని మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణా జిల్లా విజయవాడలోని మంత్రి నివాసంలో ఆయన్ను ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్రంలో మత్స్యకారులు బెస్త కులస్థుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్టంలో బెస్త కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్కు, మంత్రి అప్పలరాజుకు మహాసభ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
రూ.500 కోట్లు కావాలి..
బెస్త కార్పొరేషన్కు రూ. 500 కొట్లు కేటాయించాలని మంత్రిని కోరినట్లు వెంకటేశ్వర్లు బెస్త తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, పంచాయితీలు ఆధ్వర్యంలో ఉండే నీటి వనరులను నామినల్ ఫీజుతో చేపల పెంపకం నిమిత్తం బెస్తలకు అప్పగించాలని మంత్రిని అడిగినట్లు ఆయన పేర్కొన్నారు.
ఫిష్ స్టాల్స్ ఏర్పాటు చేేయండి..
ప్రతి మండలం, పట్టణాల్లో ప్రభుత్వమే చేపల అమ్మకానికి స్టాల్స్ నిర్మించాలన్నారు. పోషక విలువలు అధికంగా గల చేపలు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. చేపల సొసైటీలకు పూచికత్తు లేకుండా ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీ పదవులు కేటాయించండి..
రాష్ట్ర వ్యాప్తంగా బెస్త కులస్తులు సుమారు 25 నుంచి 30 లక్షల జనాభా ఉంటామని.. రాయలసీమలో పెద్ద ఎత్తున తమ జనాభా ఉందని వెంకటేశ్వర్లు మంత్రికి గుర్తు చేశారు. కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూర్ జిల్లాల్లో వైకాపా జిల్లా అధ్యక్షులుగా తమకు పార్టీ పదవులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు కేటాయించి తమను రాజకీయంగా ప్రోత్సహించాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
'పెద్ద దిక్కుగా ఉంటా'
స్పందించిన మంత్రి.... బెస్తలకు పెద్దదిక్కుగా ఉంటామని హామీ ఇచ్చినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. గంగపుత్ర బిడ్డగా మీకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటానని మంత్రి స్పష్టం చేశారని వివరించారు. జాతీయ స్థాయిలో గంగపుత్రుల భవిష్యత్ కార్యచరణకు మంత్రి ముందుంటానని భరోసా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ దండికట్ల గిరి తదితరులు పాల్గొన్నారు.