విశాఖ రాజధాని అంటూ ప్రభుత్వం చెబుతున్న మాయమాటలను అక్కడి ప్రజలు విశ్వసించట్లేదని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విశాఖ నగర కార్పొరేటర్లు, ఇతర నేతలతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. ‘నగరపాలక సంస్థ ఎన్నికల్లో విశాఖ ప్రజల తీర్పు.. వారు వైకాపా పక్షాన లేరని స్పష్టం చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ నగరంలో 4ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్నాం. పార్టీ ఆవిర్భావం నుంచి విశాఖ తెదేపాకు కంచుకోటగా ఉంది. విశాఖ ప్రజల నమ్మకానికి అనుగుణంగా ఆ నగరానికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ అండగా నిలుస్తోంది. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే నగర అభివృద్ధి మరో దశకు చేరేది. తెదేపా చేసిన అభివృద్ధినంతా వైకాపా నాశనం చేసింది. ఆ పార్టీ నేతలు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారు’ అని మండిపడ్డారు. ‘నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై పోరాడాలి. పార్టీ తరఫున విప్ జారీ చేయాలి. ధిక్కరించిన వారిని సస్పెండ్ చేయాలి’ అని సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది.
కాకినాడలో తెదేపా కార్పొరేటర్లకు విప్
కాకినాడ కార్పొరేషన్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే కౌన్సిలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తెదేపా కార్పొరేటర్లందరికీ పార్టీ విప్ జారీ చేస్తుందని, ధిక్కరిస్తే అనర్హత వేటు పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మేయర్ మహిళ అని చూడకుండా సుంకర పావనిని వైకాపా నేతలు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. మేయర్ సుంకర పావని దంపతులు మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, ఇతర అంశాలను పావని ప్రస్తావించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మేయర్ నివాసం వద్ద కెమెరాలు ఉంచడం, పార్టీ నేతలు కూడా కలవకుండా అడ్డంకులు సృష్టించడంవంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు’ అని మండిపడ్డారు.
తెలుగు మహిళ రాష్ట్ర కమిటీలోకి 16 మంది
తెలుగు మహిళ రాష్ట్ర కమిటీలోకి కొత్తగా 16 మంది చేరారు. చంద్రబాబు ఆదేశాల మేరకు వీరిని కమిటీలోకి తీసుకుంటున్నట్లు అచ్చెన్నాయుడు ప్రకటనలో తెలిపారు.
కఠిన చర్యలు తప్పవు..
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో... తన భర్తతో కలిసి కాకినాడ మేయర్ సుంకర పావని చంద్రబాబును కలిశారు. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం అంశాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అధికారం కోసం వైకాపా నేతలు... మహిళా నాయకురాలిని ఇబ్బంది పెట్టడం దారుణమని చంద్రబాబు అన్నారు. ప్రజాభిప్రాయం తారుమారు చేసే కుట్రలు దుర్మార్గమని ఆక్షేపించారు. మేయర్ ఇంటి వద్ద నిఘా కెమెరాలు పెట్టి, పార్టీ నేతలు కూడా కలవకుండా అడ్డంకులు సృష్టించడం తగదని హితవు పలికారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పార్టీ కార్పోరేటర్లందరికీ విప్ జారీ చేస్తామని... దానిని ధిక్కరిస్తే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు.
ఇదీ చూడండి: