గుంటూరు జిల్లా మంగళగిరి చేనేతన్నకు ఘనమైన చరిత్రే ఉంది. నాణ్యమైన, అందమైన వస్త్రాలకు మంగళగిరి పెట్టింది పేరు. ముచ్చటగొలిపే చేతి నేత.. మైమరిపించే డిజైన్లు.. అంచుల మెరుపులు.. బుటాల తళుకులు.. వెరసి మంగళగిరి వస్త్ర సోయగాల ప్రత్యేకతను చాటుతాయి. చేతినేతతో జాలువారే వివిధ వస్త్రశ్రేణులు అన్నితరాల వారిని ఆకర్షిస్తాయి. అయితే కాలానుగుణ పరిస్థితులకు అనుగుణంగా మిగతా రంగాల మాదిరిగానే చేనేత పరిశ్రమ పూర్తిస్థాయి నవీకరణకు నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సాంకేతికత పరిఢవిల్లుతున్న అధునాతన కాలంలోనూ సంప్రదాయ మగ్గాలపైనే కార్మికులు పనిచేస్తూ జీవితాలను నెట్టుకొస్తున్నారు. చాలీచాలనీ ఉపాధికి తోడు దానిపైనే కుటుంబమంతా ఆధారపడే పరిస్థితి ఉంది.
కరోనాతో అతలాకుతలం
తాత ముత్తాతల నుంచి వస్తున్న వృత్తిని వదిలి వెళ్లలేక, మిగతా వృత్తుల వైపు మళ్లలేని సంకటస్థితి వారిది. ఇలా అత్తెసరు సంపాదనతో.. అర్థాకలితో ఎదురీదుతున్న బడుగు జీవులపై కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసింది. కరోనా కారణంగా లాక్ డౌన్ తో 2, 3 నెలలపాటు పూర్తిస్థాయిలో వస్త్ర పరిశ్రమ స్తంభించిపోగా... ఆంక్షల సడలింపుల తర్వాతా మూడోవంతు మగ్గాలే నడుస్తున్నాయి. అన్లాక్లోనూ ప్రజలు వస్త్రాల కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ప్రజల్లో కరోనా వ్యాప్తి భయంతోపాటు దిగజారిన ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణం. ఫలితంగా నేతన్న కుటుంబాలకు చేతినిండా పని కరవైంది. మంగళగిరిలో 2,500 వరకు మగ్గాలుండగా అద్దకం, ఆసులు తోడటం, అచ్చులు అతికించడం, సైజులు తీయడం వంటి అనుబంధ రంగాలకు చెందిన కార్మికులతో కలుపుకుంటే మొత్తం చేనేత కార్మికులు 8 నుంచి 9వేల మంది వరకు ఉంటారు. వీరందరికీ ఇప్పుడు ఉపాధి గగనంగా మారింది.
ఉపాధికి గండి
గతంలో నెలకు 8వేల నుంచి 10వేల రూపాయల వరకు ఆదాయం రాగా... కరోనాతో సరకు నిలిచి, మగ్గాలు ఆగి వారి ఉపాధికి గండిపడింది. గతంలో నెలకు 4 బార్లు అంటే 16 చీరలు నేయగా... ఇప్పుడు సగం చీరల ఉత్పత్తికీ అవకాశం లేత ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వారి ఆదాయం నెలకు రూ. 2వేల నుంచి 4వేలకు మించడం లేదు. వాటితో ఇంటి అద్దె కట్టాలో, ఆకలి తీర్చుకోవాలో తెలియక కార్మికులు విలవిల్లాడుతున్నారు. మిగతా రంగాల్లో కుటుంబ సభ్యులు వేర్వేరు పనులకు వెళ్తారు. చేనేతరంగంలో మాత్రం కుటుంబమంతా దీనిపైనే ఆధారపడుతున్నారు. సంప్రదాయ వృత్తిని వదల్లేక వచ్చే నాలుగు రూకలతోనే కుటుంబాన్ని ఈదాల్సిన దయనీయస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లల్ని ఇటువైపు రానీయకుండా జాగ్రత్త పడుతున్నారు. అత్తెసరు ఆదాయం మధ్య అనారోగ్య పరిస్థితులు అప్పుడప్పుడు కార్మికులకు సవాళ్లు విసురుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ నేతన్ననేస్తం నిబంధనల కారణంగా కొందరికే పరిమితమైంది. సొంతింట్లో మగ్గముంటే తప్ప పింఛను ఇవ్వబోమన్న ప్రభుత్వ నిబంధన కారణంగా చాలామంది చేనేత కార్మికులకు ఈ అవకాశం దక్కలేదు. ఇప్పటికైనా తమ గోడును ప్రభుత్వం పట్టించుకోవాలని... చేనేత కార్మికులందరికీ పించన్లు అందించాలని వేడుకుంటున్నారు.
నిలిచిన దిగుమతులు-ఆగిన మగ్గాలు
మంగళగిరి వస్త్ర పరిశ్రమ వార్షిక టర్నోవరు రూ. 100 నుంచి 120 కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆ మొత్తం రూ. 30 నుంచి 40 కోట్లకు పడిపోయింది. కొవిడ్కు ముందు వచ్చే వినియోగదారుల్లో ఐదో వంతు మాత్రమే ఇప్పుడు వస్తున్నారని.. వినియోగదారుల్లో పూర్తిగా భయం పోలేదని చెబుతున్నారు. అమ్మకందార్లు. సొసైటీల పనితీరు నామమాత్రంగా మారగా.. వస్త్రపరిశ్రమ 80 శాతం మాస్టర్ వీవర్లపైనే ఆధారపడి కొనసాగుతోంది. వీరే సాధారణ కార్మికులకు మగ్గాల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. కొవిడ్ కారణంగా జైపూర్, కోల్ కత్తా, బెంగళూరు, దిల్లీ వంటి ప్రాంతాలకు వస్త్రాల రవాణా నిలిచిపోయింది. విమానాల రాకపోకలు ఆగి అక్కడినుంచి విదేశాలకు దిగుమతి నిలిచిపోయింది. ఫలితంగా ఎక్కడి నిల్వలు అక్కడే పేరుకుపోయాయి. ఇలా మంగళగిరి పరిధిలో రూ. 35 నుంచి 40 కోట్ల వరకు సరకు నిలిచిపోయింది. గిరాకీ తగ్గిపోవటంతో మాస్టర్ వీవర్లు తమపై ఆధారపడ్డ కార్మికులకు పూర్తిస్థాయిలో మగ్గాలు అందించి ఉపాధి కల్పించలేకపోతున్నారు.
ప్రభుత్వాలే ఆదుకోవాలి
ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులను, చేనేత వస్త్రరంగాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలే ఆదుకోవాలని ఆ వర్గాల నుంచి విన్పిస్తున్న నివేదన. ముడి నూలును జీఎస్టీ పరిధిలోకి చేర్చి 5.2 శాతం పన్ను వసూలు చేస్తుండటంతో వ్యాపారులు అల్లాడుతున్నారు. జీఎస్టీ నుంచి చేనేతరంగాన్ని మినహాయించాలని ఎప్పటినుంచో వేడుకుంటున్నా ఫలితం ఉండటం లేదని వాపోతున్నారు. మరోవైపు పేరుకుపోయిన నిల్వలను రాష్ట్రప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేస్తేనే చేనేత వస్త్ర పరిశ్రమ బతికిబట్టకట్టే అవకాశముందని మాస్టర్ వీవర్లు అభిప్రాయపడుతున్నారు. 1992లో ఇలాంటి పరిస్థితి వస్తే ఇలాగే సమస్యను పరిష్కరించారని వారు గుర్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..