ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు సికింద్రాబాద్లోని మిలటరీ ఆసుపత్రిలో ప్రత్యేక మెడికల్ బోర్డు, న్యాయాధికారి సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించాలని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఆయన్ను అక్కడే ఉంచి సొంత ఖర్చులతో వైద్యసేవలు అందించాలని సూచించింది. ఆయన ఆసుపత్రిలో ఉన్న కాలాన్ని జ్యుడీషియల్ కస్టడీ కింద పరిగణించాలని పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్ అయిన రఘురామకృష్ణరాజు గత ఏడాది డిసెంబర్లో బైపాస్ సర్జరీ చేయించుకోవడం, ప్రస్తుతం ఆయన శరీరంపై గాయాలున్నట్లు వైద్యనివేదికలో కనిపించడం, ఆయన ఆరోగ్య పరిస్థితిపై మెజిస్ట్రేట్ ఇచ్చిన నివేదిక, హైకోర్టు జారీ చేసిన ఆదేశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. తక్షణం ఆయన్ను సికింద్రాబాద్ సైనికాసుపత్రికి తరలించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదేనని స్పష్టం చేసింది.
ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు తనపై 124ఎ సెక్షన్ కింద రాజద్రోహం కేసు నమోదు చేసి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ తనకు బెయిల్ మంజూరు చేయాలని రఘురామకృష్ణరాజు, పోలీసు కస్టడీలో తన తండ్రిపై థర్డ్డిగ్రీ ప్రయోగించినందున ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించాలని, ఇటీవలే బైపాస్ సర్జరీకి గురైనందున ఆయనకు తగిన వైద్యసేవలు అందించాలని కోరుతూ ఎంపీ కుమారుడు భరత్ దాఖలు చేసిన ఎస్ఎల్పీల్లో సుప్రీంకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అధికార పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణరాజు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారన్న రాజకీయకక్షతోనే ఆయనపై కేసు పెట్టి వేధిస్తున్నారని, పోలీసుల థర్డ్డిగ్రీలో తీవ్రంగా గాయపడిన తన క్లయింట్కు వైద్యపరీక్షలు నిర్వహించిన ప్రభుత్వాసుపత్రి గైనకాలజిస్ట్.. వైకాపా లీగల్సెల్ సభ్యుడి సతీమణి కాబట్టి వారిచ్చిన నివేదిక పక్షపాతంతో కూడి ఉన్నందున స్వతంత్రంగా సికింద్రాబాద్ సైనికాసుపత్రిలో, లేదంటే దిల్లీ ఎయిమ్స్లో పరీక్షలు నిర్వహించాలని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ వాదనలను విన్న అనంతరం సుప్రీంకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి ఎయిమ్స్, విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కోర్టుకు విన్నవించారు. మంగళగిరి ఎయిమ్స్లో సరైన సిబ్బంది లేకపోవడంతో పాటు, దాని పాలకమండలిలో ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు సభ్యులుగా ఉన్నందున అక్కడ తమకు న్యాయం జరిగే అవకాశం ఉండదంటూ రోహత్గీ తోసిపుచ్చారు. మణిపాల్ ప్రైవేటు ఆసుపత్రి కాబట్టి వారిపై ప్రభుత్వపరంగా ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్నారు. స్వతంత్ర సంస్థలైన సికింద్రాబాద్ సైనికాసుపత్రి లేదా దిల్లీ ఎయిమ్స్లో పరీక్షలు చేయించాలని కోరారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో సుప్రీంకోర్టు ఆ ప్రతిపాదనకు సమ్మతించింది. బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ కేసులో రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు దాఖలు చేసిన ఎస్ఎల్పీలకు జవాబివ్వడానికి ఏపీ ప్రభుత్వ న్యాయవాది రెండు రోజుల గడువు కోరినందున వారికి 19వ తేదీవరకు సమయం ఇచ్చింది. వాటికి పిటిషనర్లు సమాధానం చెప్పాలనుకుంటే ఈ నెల 20లోపు దాఖలు చేయొచ్చని చెప్పింది.
మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లోని అంశాలే పరిగణనలోకి
‘రఘురామకృష్ణరాజును వెంటనే వైద్యపరీక్షల కోసం సికింద్రాబాద్ సైనికాసుపత్రికి తరలించాలి. దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు కల్పించిన వై కేటగిరీ భద్రతను సైనికాసుపత్రి వరకు కొనసాగించాలి. వైద్యపరీక్షల సమయంలో భద్రత అక్కర్లేదు. సైనికాసుపత్రి ఉన్నతాధికారి ఏర్పాటు చేసే ముగ్గురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు వైద్యపరీక్షలు నిర్వహించాలి. వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా న్యాయాధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశిస్తున్నాం. వైద్యపరీక్షల ప్రక్రియనంతా వీడియో తీసి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు సీల్డ్ కవర్లో అప్పగించాలి. దాన్ని వారు సుప్రీంకోర్టుకు పంపాలి. రఘురామకృష్ణరాజు అధికారపార్టీ ఎంపీ అయినప్పటికీ ఆయన సొంత పార్టీపై విమర్శనాత్మకంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్న రాజకీయ కక్షతో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు ఆయన న్యాయవాది ముఖుల్ రోహత్గీ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేం అంత లోతుగా పరిశీలించడం లేదు. ఈ నెల 15న రిమాండ్ కోసం రఘురామకృష్ణరాజును కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలనే పరిగణనలోకి తీసుకుంటున్నాం. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు ఆయనకు గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు, ఇతర ప్రభుత్వ డాక్టర్లతో కూడిన మెడికల్బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యపరీక్షల నివేదికను అందజేశారు. దాన్ని మేం పరిశీలించాల్సి ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది.
ఎంపీపై కేసు.. పూర్తిగా బోగస్: రోహత్గీ
ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ నమోదు చేసిన కేసు పూర్తిగా బోగస్ అని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ సుప్రీంకోర్టులో వాదించారు. ఎఫ్ఐఆర్ చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుందన్నారు. నేరం ఎక్కడ జరిగిందంటే రాష్ట్రమంతటా అని ఎఫ్ఐఆర్లో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఐడీ డీఐజీ విచారణ నివేదిక (ఎంక్వైరీ రిపోర్టు) ఆధారంగా సుమోటోగా కేసు దాఖలు చేసినట్లు అందులో పేర్కొన్నారన్నారు. విద్వేషాలు నెలకొన్నట్లు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులే విచారణ జరిపి, ఆ నివేదిక ఆధారంగా సుమోటో కేసు నమోదు చేయడం బోగస్ అన్నారు. ఇది పూర్తి రాజకీయ కక్షతో చేసిన పని అని వ్యాఖ్యానించారు. ‘ఇది చాలా అసాధారణ అంశాలతో కూడిన అంశం. అధికార పార్టీ ఎంపీ అయిన పిటిషనర్ సొంత పార్టీ సభ్యుల నుంచే తనకు ముప్పు ఉందని, భద్రత కల్పించాలంటూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు’ అని రోహత్గీ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ కేసును వినాలనుకుంటే శుక్రవారానికి వాయిదా వేయాలని.. ఆలోపు తాము దీనికి సమాధానం దాఖలు చేయడంతోపాటు, కేస్ డెయిరీ, ఇతర దస్తావేజులు సమర్పిస్తామని ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. దాన్ని రోహత్గీ వ్యతిరేకించారు. తన క్లయింట్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ‘ముఖ్యమంత్రి ఒక సామాజికవర్గంకోసం తప్ప మిగతావారి కోసం పని చేయట్లేదని ఎంపీ విమర్శించారంటూ పోలీసులు సీఐడీకి నివేదిక పంపారు. ఆయన విమర్శలు చేయడం తప్పితే, ఆయుధం పట్టుకుని హింసకు పాల్పడమని లేదా తిరుగుబాటు చేయమని ఎప్పుడూ పిలుపునివ్వలేదు. సెక్షన్ 124 కింద కేసు పెట్టాలంటే అలాంటి సాక్ష్యం ఉండాలి. ఇక్కడ అలాంటివేమీ లేవు. ప్రభుత్వం కొవిడ్ పరిస్థితులను కూడా సరిగా నిర్వహించట్లేదని నా క్లయింట్ టీవీ ఛానళ్లలో విమర్శించడంతో ఆయనతోపాటు, రెండు టీవీ ఛానళ్లు, రిపోర్టర్లపైనా కేసులు పెట్టారు. బెయిల్ రాకూడదన్న ఉద్దేశంతోనే 124ఎ కింద కేసు పెట్టారు. బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశాం. ఈ కేసు సెక్షన్ 439 కింద ఉమ్మడి న్యాయపరిధి (కంకరెంట్ జ్యురిస్డిక్షన్) ఉందన్న విషయాన్ని హైకోర్టు విస్మరించి పిటిషన్ను కొట్టేసి బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లమని చెప్పింది. మెజిస్ట్రేట్ సూచించినట్లు ప్రైవేటు ఆసుపత్రిలోనూ వైద్యపరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా సోమవారం పరీక్షలు చేయలేదు’ అని రోహత్గీ పేర్కొన్నారు. రమేష్ ఆసుపత్రిలో నిరుడు అగ్నిప్రమాదం జరిగి 20 మంది చనిపోయినందున అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించడం కష్టమని, మంగళగిరి ఎయిమ్స్లో పరీక్షలు చేయిస్తామని దుష్యంత్ దవే చెప్పారు. న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటూ సైనిక ఆసుపత్రి అయితే తటస్థంగా ఉంటుందని.. అవి ఏపీలో ఎక్కడైనా ఉన్నాయా అని అడిగారు. సమీప సైనికాసుపత్రి సికింద్రాబాద్లోనే ఉందని ఎంపీ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు చెప్పారు. 35 కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రికి బెయిల్ రద్దు చేయాలని తన క్లయింట్ కేసు వేయడం వల్లే వాళ్లు కక్ష కట్టారని, అందువల్ల ఆయన్ను ఆంధ్రప్రదేశ్ బయట పరీక్షించాలని రోహత్గీ కోరారు.
పరీక్షలకు సరే.. చికిత్స వద్దు: రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది
రఘురామకృష్ణరాజుకు మరోసారి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో కానీ, మణిపాల్ ప్రైవేటు ఆసుపత్రిలో న్యాయాధికారి సమక్షంలో మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించడానికి తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే చెప్పారు. ఆ రెండింటికీ ప్రత్యామ్నాయంగా దిల్లీ ఎయిమ్స్కి పంపాలని, అందుకు అవసరమైన ఖర్చులను రఘురామకృష్ణరాజే భరిస్తారని రోహత్గీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దాన్ని అభ్యంతరం పెట్టలేదు. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజుకు స్వతంత్ర సంస్థ అయిన సికింద్రాబాద్ సైనికాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించాలని కోర్టు సూచించింది. అందుకు ప్రతివాదుల తరఫు న్యాయవాదులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. రఘురామకృష్ణరాజును వైద్యపరీక్షల కోసం మాత్రమే అక్కడికి పంపాలి తప్ప చికిత్స కోసం అక్కడే ఉంచడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది అన్నారు. ‘మొత్తం వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, వివిధ సందర్భాల్లో మెజిస్ట్రేట్, హైకోర్టు దాఖలు చేసిన ఉత్తర్వులు, రఘురామకృష్ణరాజు ఆరోగ్య పరిస్థితులు, వైద్యనివేదికలో కనిపించిన గాయాలను దృష్టిలో ఉంచుకొని ఆయన్ను వైద్యపరీక్షలు, చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ సైనికాసుపత్రికి పంపుతున్నాం’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి;