Jana Chaitanya Vedika Round Table Conference: వైసీపీ ప్రభుత్వం సచివాలయ, వాలంటరీ వ్యవస్థల్ని సమాంతరంగా ఏర్పాటు చేసి.. స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసిందని జనచైతన్య వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. రాజమహేంద్రవరంలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో.. స్థానిక ప్రభుత్వాల సాధికారిత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక సంస్థలను ప్రభుత్వం నీరుగార్చిందని.. ఈ సమావేశంలో వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా.. కేంద్రం అందించిన నిధులను మళ్లించి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో.. సర్పంచ్లకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై వక్తలు గళం విప్పారు. ప్రజాస్వామ్యంలో గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో.. 73, 74వ రాజ్యాంగ సవరణ చేశారని గుర్తు చేశారు. ఈ సవరణ ద్వారా స్థానిక సంస్థలను, స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించినప్పటికీ.. రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విమర్శించారు. సచివాలయానికి వెళ్తే అక్కడ కనీసం కూర్చునేందుకు కుర్చీ లేని పరిస్థితి తెచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు.
Village Development Works: మీ పనులు మాకొద్దు బాబోయ్..! ప్రభుత్వ పనులంటే ఆసక్తి చూపని సర్పంచ్లు..
"గ్రామీణ రోడ్లు పూర్తిగా అస్తవ్యస్థంగా ఉన్నాయి. దానికి కారణం నిధులు లేకపోవడం. ఒక్క వాలంటీరు కూడా సర్పంచ్ చెప్పిన మాట వినే పరిస్థితి లేదు. గ్రామంలోని పనులు, సర్పంచ్కు, స్థానిక సంస్థలకు సంబంధం లేకుండా కొనసాగుతున్న పరిస్థితి." -లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు
"స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు దగ్గరగా ఉండే ప్రభుత్వాలు. ఎక్కడ్నో ఉండే మీకు కనిపించదు, వినిపించదు. వారికి ప్రజల సమస్యలు కనిపిస్తాయి, వినిపిస్తాయి." -తులసిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత
నిధులివ్వనప్పుడు సమావేశాలకు ఎందుకు పిలుస్తారు! వైసీపీ సర్పంచ్ ఆగ్రహం
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకు ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదని.. సీఎం జగన్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా.. ఫలితం లేకుండా పోయిందని వైసీపీ సర్పంచ్, సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాపారావు ఆరోపించారు. 13 వేల మంది సర్పంచ్లు తలచుకుంటే వైసీపీకి 20 లక్షల మందిని.. ఓటు వేయకుండా చేయవచ్చని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ పాలనలో గ్రామ స్వరాజ్యం అన్న భావనకు అర్థం లేకుండా పోయిందని ప్రముఖ్య న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. పలు పార్టీల నాయకులు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
"గ్రామ స్వరాజ్యం లేదండి ఈ రోజు. వైసీపీ స్వరాజ్యం ఉంది. ఎక్కడా కూడా సర్పంచ్ తన పనులను తాను చేసుకోలేని దుస్థితిలో ఉన్నాడు. అధికార వైసీపీ మాటే నెగ్గుతోంది తప్పా.. విజయం సాధించిన సర్పంచ్ మాట ఎక్కడా నెగ్గడం లేదు." -నరేంద్రబాబు, కార్యదర్శి, రాష్ట్ర సర్పంచ్ల సంఘం
"90 శాతం సొంత పార్టీ సర్పంచిలే తిరగబడ్డారు. నేను కూడా వైసీపీ సర్పంచ్నే. ఈ వైసీపీ ప్రభుత్వ వైఖరి నచ్చక.. రోడ్డుపైకి వచ్చి ఎంత ఫైట్ చేసినా.. చెవిటి వాడి శంఖం ఊదిన విధంగా జగన్ ప్రభుత్వం ఉంది." -పాపారావు, అధ్యక్షుడు, సర్పంచ్ల సంక్షేమ సంఘం