పల్నాడును ప్రశాంతం ఉంచుకుందాం : ఎస్పీ విజయరావు పల్నాడు ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా రెచ్చగొడితే చట్టపరంగా చర్యలు చేపడతామని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు హెచ్చరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం... ఆయన పల్నాడు ప్రాంతంలోని ఆత్మకూరు, జంగమేశ్వరపాడు, పిన్నెల్లి గ్రామాల్లో పర్యటించారు. శాంతిభద్రతల పరిస్థితి సమీక్షించారు. ప్రజలు శాంతి, సామరస్యంతో మెలగాలని... శాంతికి విఘాతం కలిగించేలా ఏ కార్యకలాపాలకు పాల్పడొద్దని హితవుపలికారు. ఎవరైనా బయట నుంచి వచ్చి రెచ్చగొడితే వారిపై కేసులు పెడతామన్నారు. తరచూ గొడవలకు దిగేవారిని గుర్తించి వారిపై రౌడీషీట్లు తెరుస్తామని విజయరావు హెచ్చరించారు. విద్యార్థులు చదువులు, ఉద్యోగ పరీక్షలపై దృష్టి సారించాలని, అనవసర వివాదాలకు పోవద్దన్నారు. గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అందరూ సహకరించాలని కోరారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటారు.ఇదీ చదవండి :
శిక్షణ ముగిసింది.. ఇక కర్తవ్యమే మిగిలింది..!