తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన రాజానగరం, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో కూరగాయల తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. దొండ, బెండ, వంగ, కాకర, టమాట, దోస తదితర కూరగాయలతో పాటు ఆకు కూరలను రైతులు పండిస్తున్నారు. ఈ కాయగూరల్ని స్థానిక మార్కెట్లతో పాటు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, మడికి మార్కట్లకు తరలిస్తుంటారు. అయితే కరోనా దెబ్బతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రధానంగా వంగ తోట సాగుచేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకరాకు కౌలు సహా రూ.70 వేల వరకు పెట్టుబడులు పెట్టామని... తీరా పంట చేతికొచ్చే సమయంలో కరోనా రూపంలో కష్టం ముంచుకొచ్చిందని రైతులు వాపోతున్నారు. లాక్డౌన్ వల్ల రవాణా స్తంభించిపోవటంతో వంకాయలు తోటల్లోనే మగ్గి పోతున్నాయని ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
అప్పు చేసి పెట్టుబడి పెట్టాం
జిల్లాలోని మెట్ట ప్రాతంలో సుమారు 14 వందల ఎకరాల్లో వంగతోటలు సాగవుతున్నాయి. అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు. కరోనా కారణంగా కూరగాయలు కోసేందుకు కూలీలు ముందుకు రావడం లేదు. వచ్చిన కొంతమందితో సాయంత్రం పూట కాయలు కోసి... అతి కష్టం మీద సమీపంలోని మార్కెట్లకు తరలిస్తున్నారు. ఐనప్పటికీ సగం కూడా అమ్ముడు పోవడం లేదని రైతులు విలపిస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాలు ఆదేశించినా.... క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులతో రైతులు కుదేలవుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ విక్రయాలకు మార్గం సుగుమం చేయాలని వేడుకొంటున్నారు.
ఇదీ చూడండి: