తూర్పు గోదావరి జిల్లాలో నిన్న ఒక్కరోజే ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంపై అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఇప్పటి వరకూ జిల్లాలో తొమ్మిది పాజిటివ్ కేసులు బయటపడడ్డాయి. దిల్లీ వెళ్లొచ్చిన వారిని కలిసిన వారికీ కరోనా వైరస్ సోకడం జిల్లా వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. రాజమహేంద్రవరానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు దిల్లీ నుంచి వచ్చిన అనంతరం కొత్తపేటలో నివాసం ఉంటున్న అతని కుమారుడు, కోడలు, మనవడు, మనమరాలు కలిశారు. వీరిలో కరోనా బాధితుడి కోడలు, మనవడు, మనవరాలుకు కరోనా సోకింది.
కాకినాడకు చెందిన వ్యక్తి దిల్లీ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ప్రత్తిపాడు మండలం, పిఠాపురం, కాకినాడలో సంచరించాడు. అతడిని కలిసిన పిఠాపురానికి చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి కరోనా సోకింది. ఆ విద్యార్థి మరికొంతమంది యువకులతో కలిసి క్రికెట్ ఆడినట్లు అధికారులు సమాచారం సేకరించారు. కాకినాడలోనూ బిర్యాని అమ్ముకునే మరో వ్యక్తికీ కొవిడ్-19 సోకింది. అతను దిల్లీ వెళ్లోచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినట్లు అధికారులు చెప్తున్నారు. వారికి సన్నిహితంగా ఉన్న మరి కొంతమందిని క్వారంటైన్కు తరలిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి 26, కాకినాడ నుంచి 10 మంది దిల్లీ వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు.
కొత్తపేటలో రెడ్జోన్
కొత్తపేటలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ పరిధిలోని 500 మీటర్ల నిడివిని రెడ్జోన్గా గుర్తించినట్లు అమలాపురం ఆర్డీవో బీహెచ్ భవాని శంకర్ వెల్లడించారు. 330 కుటుంబాలకు రేపటి నుంచి నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వైద్య సేవలను అందిస్తామని తెలిపారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాల వద్ద 730 పడకలతో కొవిడ్-19 ఆసుపత్రిని 10 వెంటిలేటర్లతో ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని పి.గన్నవరం, భట్లపాలెం, ముమ్మిడివరం, రావులపాలెం, రాజోలులో 200 పడకలతో మరో ఐదు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అమలాపురం డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్కు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆర్డీవో భవాని శంకర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: