క్షేత్రస్థాయిలో సమస్యలు, పార్టీ బలోపేతానికి శ్రేణులు అవలంబించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేయటమే అజెండాగా రాయలసీమ ఆత్మీయ యాత్రను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్వహించారు. తిరుపతిలో మాట్లాడుతూ... వైకాపా ఆరు నెలల పాలనపై ప్రశ్నాస్త్రాలు సంధించారు.
అధికారంలోకి రాగానే భవంతుల కూల్చివేతలపై దృష్టి
ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చీరాగానే గత ప్రభుత్వంపై కక్షపూరితంగా భవంతుల కూల్చివేతలపై దృష్టి సారించిందన్న జనసేనాని... సమస్యలను అధిగమించేలా ప్రణాళికలు రచించటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
యురేనియం అడగటంలో ఆంతర్యమేమిటి
కడప జిల్లాలో యురేనియం తవ్వకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే... కేంద్రాన్ని యురేనియం శుద్ధి పరిశ్రమ కోసం ప్రభుత్వం అడగటంలో ఆంతర్యమేమిటని పవన్ సూటిగా ప్రశ్నించారు. పులివెందుల సమీపంలోని తుమ్మలపల్లి యురేనియం తవ్వకాలతో ప్రజలు అనుభవిస్తున్న బాధలు సీఎం జగన్కు కనిపించటం లేదా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కాంట్రాక్టుల కోసమే కడప ఉక్కు పరిశ్రమను కాదని యురేనియం కోసం వైకాపా నాయకులు వెంపర్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలపై వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆయన... కియా సీఈఓనే బెదిరిస్తే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా వ్యాఖ్యలు వక్రీకరించారు
తెలుగు మాధ్యమం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వైకాపా వక్రీకరించందన్న జనసేనాని... తామెప్పుడూ ఆంగ్లమాధ్యమాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదన్నారు. తెలుగు మాధ్యమంలో చదువుకునే అవకాశం తప్పనిసరిగా ఉండాలని పోరాటం చేస్తున్నామన్న పవన్....హిందూ ధర్మపరిరక్షణ కోసం చేసిన వ్యాఖ్యలను వైకాపా తప్పుగా ప్రచారం చేస్తోందన్నారు. రాష్ట్రంలో సామూహికంగా మతమార్పిడులు జరుగుతుంటే సీఎం జగన్కు పట్టటం లేదా అని ప్రశ్నించిన ఆయన.....వీటి విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే వాళ్లే ప్రోత్సహిస్తున్నారని అనుకుంటామన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని స్థానికులే చెబుతున్నారన్న జనసేనాని... మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఏ కారణాలతో తప్పించారో ప్రజలకు చెప్పాలన్నారు.
అమిత్షా అంటే వైకాపా నేతలకు భయం, నాకు గౌరవం
వైకాపా నేతలకు అమిత్ షా అంటే భయమని...తనకు మాత్రం ఆయనంటే గౌరవమన్న పవన్ కల్యాణ్....ప్రత్యేక హోదా విషయంలో తాను సిద్ధాంత పరంగా మాత్రమే భాజపాను వ్యతిరేకించానన్నారు. ఆశయాలకు కట్టుబడే భాజపా, తెదేపాలతో కలిసి తిరిగి పోటీ చేయలేదన్నారు. ఈ విషయంలో అవాకులు చెవాకులు పేలే వైసీపీ నేతలు ఎన్నికలప్పుడు తన దగ్గరకు వచ్చిన వైకాపా పెద్దలను అడిగి తెలుసుకుని మాట్లాడాలన్నారు.
ఇదీ చూడండి: