రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రంజాన్ మాసంలో దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు..రంజాన్ పర్వదినం పురస్కరించుకొని నూతన వస్త్రాలను ధరించి ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా పేదలకు దానధర్మాలు చేస్తూ తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈద్ ముబారక్ అంటూ ఒకరికొకరూ శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేశారు.
రంజాన్ పండగను పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. సమాజంలో చెడుని మంచితోనే నిర్మూలించాలని ఖురాన్ చెప్పిందని ముస్లిం మత పెద్దలు ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా కోడుమూరులో రంజాన్ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రంజాన్ మాసం ముస్లింలకు పవిత్రమైన రోజులు కావడంతో నెలరోజులపాటు ఉపవాస దీక్షలు చేశారు. నగరంలోని పాత, కొత్త ఈద్గాల వద్ద ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా నాయుడుపేట అమీర్ షా వలీ మసీదులో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు నమాజ్ చేశారు. భక్తి శ్రద్ధలతో నమాజ్ లో పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఉదయాన్నే 6 గంటలకు ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు.
తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రం కాకినాడలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ వేడకలు నిర్వహించుకున్నారు. జేఎన్టీయూ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతపెద్దలు ఖురాన్ లో పండగ సందేశం వినిపించారు. బంధుమిత్రులతో కలిసి ముస్లిం సోదరులు పండగ సంతోషం పంచుకున్నారు. నగర ఎమ్మెల్యేగా ఎన్నికైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వేడుకలకు హాజరై... రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.