ప్రధాన రైల్వే కూడలి గుంతకల్లులో అధికారులకు సరైన ప్రణాళిక లేకపోవటంతో ఇక్కడ రెండు వేర్వేరు రైల్వేస్టేషన్లుగా కొనసాగుతున్నాయి. కొన్ని రైళ్లు ఒక ప్లాట్ఫారం నుంచి వేరే ప్లాట్ఫారానికి చెందిన మార్గంలో వెళ్లటానికి ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ మొత్తం ఏడు ప్లాట్ఫారాలు ఉన్నాయి. 1, 2, 3 ప్లాట్ఫారాలు ఒక స్టేషన్గా, 4, 5, 6, 7 ప్లాట్ఫారాలు మరో స్టేషన్గా కొనసాగుతున్నాయి. అనంతపురం వైపు నుంచి గూళ్లపాల్యం మీదుగా వచ్చే రైళ్లు 1 నుంచి 3 ప్లాట్ఫారాల్లోకి మాత్రమే వెళ్లగలవు గానీ వేరే ప్లాట్ఫారాల్లోకి వెళ్లడానికి జంక్షన్లో అవకాశం లేదు. బళ్లారి, ఆదోని, గుంటూరు వైపు నుంచి వచ్చే రైళ్లు జంక్షన్లోని 1, 2, 3 ప్లాట్ఫారాల్లోకి వస్తే అవి గుత్తి మీదుగా అనంతపురం, బెంగళూరు, చెన్నైలకు వెళ్లలేవు. లైన్లను అనుసంధానం చేసేందుకు అధికారులు ఆరు సంవత్సరాల కిందట రూ.20 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేసినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
జంక్షన్లో ఇబ్బందులు
ఏ మార్గంలో నుంచైనా రైలు జంక్షన్లోకి వస్తే అది ఎటైనా వెళ్లడానికి అనువుగా రైలు మార్గాలు ఉండాలి. అన్ని ప్లాట్ఫారాలకు చెందిన లైన్లను అనుసంధానం చేయడానికి గతంలోని జంక్షన్ ముఖద్వారం భవనాలను తొలగించి లైన్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం పాత భవనాలను వినియోగించడంలేదు. వీటిని తొలగించి జంక్షన్లోని అన్ని లైన్లను అనుసంధానం చేయాల్సి ఉంది. వివిధ ప్లాట్ఫారాల్లో ముందే రైళ్లు ఆగి ఉంటే వచ్చే రైళ్లను జంక్షన్లో నిలపడానికి వీలు లేదు. ప్లాట్ఫారాల్లోని రైళ్లు వెళ్లిన తరువాతనే వచ్చే రైళ్లను ఆపుకోవడానికి వీలవుతుంది. దీని వల్ల రైళ్లు గంటల తరబడి జంక్షన్ శివారులోనే నిలిపేయాల్సి వస్తుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీన్ని నిలువరించడానికే లైన్ల అనుసంధానం పనులను పూర్తిచేయాల్సి ఉంది.
బైపాస్లైన్ పూర్తయితేనే..
గుంటూరు లైనుకు సంబంధించి జంక్షన్లోకి బైపాస్లైన్ను నిర్మించిన తరువాత జంక్షన్లోని అన్ని ప్లాట్ఫారాలను కలుపుతూ లైన్ల అనుసంధానం పనులను చేపడతామని సంబంధిత రైల్వే అధికారులు చెప్పారు. బైపాస్లైన్ పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. అనుసంధానం చేయకపోవడంతో జంక్షన్ రెండు స్టేషన్లుగా కొనసాగుతున్న విషయం వాస్తవమేనని చెప్పారు.
ఇదీ చదవండి: ఆ మంత్రుల పనితీరుపై మోదీ సమీక్ష!