తమకు న్యాయం చేయాలంటూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేత ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ యజమానులు నిరసన చేపట్టారు. జేసీ ట్రావెల్స్లో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి విక్రయించారని.. ఆ వాహనాలను రవాణా శాఖ జప్తు చేసిందని ఆరోపించారు. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన లారీలు జప్తుచేయడంతో పాటు తమపై కేసులు కూడా నమోదుచేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం జరిగే వరకు కదిలేదిలేదంటూ జేసీ ప్రభాకర్ ఇంటి ముందు బైఠాయించారు. పట్టణ సీఐ తేజమూర్తి బాధితులను పోలీసు స్టేషన్కి తరలించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసులు, ఎంవీఐ రమణా రెడ్డి బాధితులను విచారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు జేసీ. ట్రావెల్స్ యజమాని జేసీ. ప్రభాకర్రెడ్డితో పాటు మరో నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా డీఎస్పీ తెలిపారు.