బుల్లితెర వర్ధమాన నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన ఇంట్లో నిన్న సాయంత్రమే ఉరేసుకుంది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన ఝాన్సీ మాటీవీలో ప్రసారమవుతున్న పవిత్రబంధం సీరియల్లో నటించింది. విజయవాడకు చెందిన సూర్యతో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. తల్లిదండ్రులకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా ఆమె డిప్రెషన్లో ఉన్నట్లు సోదరుడు దుర్గాప్రసాద్ తెలిపారు.
మంగళవారం రాత్రి ఝాన్సీ సోదరుడు దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చాక తలుపు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో బలవంతంగా బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే ఆమె ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. దుర్గాప్రసాద్ వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుమార్తె మృతిపై తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకుని ఝాన్సీ సెల్ఫోన్ సీజ్ చేశారు.