వివిధ దేశాల్లో కొవిడ్-19 వ్యాప్తిని మ్యాప్ చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), అమెరికాలోని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం అందించిన డేటా ఆధారంగా భారత్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో గణితశాస్త్రవేత్తలు కొన్ని సంభావ్యత నమూనాలను రూపొందించారు. దీని ఆధారంగా వచ్చే 2-3 వారాల్లో దేశంలో కరోనా కేసులు 415-1,000కి చేరొచ్చని అంచనా వేశారు. చెన్నైలోని మేథమేటికల్ ఇన్స్టిట్యూట్కు చెందిన సౌరిష్ దాస్.. ‘ట్రాన్స్ఫర్ లెర్నింగ్’ అనే విధానంతో విశ్లేషణ చేశారు. ఇటలీ, చైనా సహా వ్యాధి విజృంభణ ఎక్కువగా ఉన్న దేశాల్లో వైరస్ వ్యాప్తి తీరుతెన్నులను ఇందులో పరిశీలించారు. వాటిని భారత్లోని పరిస్థితులకు అనుకరించి చూశారు.
భారత్లోనూ అలా చేస్తే..
చైనా తరహాలో ఈ వ్యాధి భారత్లోనూ విస్తరించే వీలుందని మనం భావించి, స్వీయ ఏకాంత చర్యలు, సామాజిక దూరం వంటివి కట్టుదిట్టంగా పాటిస్తే.. భారత్లోనూ చైనా తరహా విజయాలు నమోదవుతాయి. వైరస్ వ్యాప్తిని నివారించడంలో విఫలమైతే ఇటలీ తరహా పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఏప్రిల్ 15 నాటికి కేసుల సంఖ్య 3500ను మించిపోతాయి. అయితే యువ జనాభా అధికంగా ఉన్నందువల్ల మన దేశంలో అంతపెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం లేదు. ఇటలీలో సరాసరి వయసు 45 కాగా.. భారత్లో అది 28గా ఉంది’’ అని సౌరిష్ దాస్ పేర్కొన్నారు. అయితే భారత్కు ప్రత్యేకమైన సమాజ వ్యవహారశైలి, వాతావరణం వంటి అంశాలను ఇందులో విస్మరించారని, ఇతర దేశాల నుంచి సేకరించిన డేటాపై ఆధారపడటం సరికాదని మరో శాస్త్రవేత్త సీతాభ్ర సిన్హా పేర్కొన్నారు.
నిర్లక్ష్యానికి ఇరాన్ మూల్యం!
ఈ జాగ్రత్తలు ముందే తీసుకొని ఉంటే..
తేలిగ్గా తీసుకుంటే కరోనా ఎంత ప్రమాదకరమో.. ఇరాన్లో ఈ వైరస్ పడగవిప్పిన తీరు తేటతెల్లం చేస్తోంది. పశ్చిమాసియాలో ప్రతి 10 కేసుల్లో 9 ఇక్కడే నమోదవుతున్నాయి. ఈ ప్రాంతంలోని మిగతా దేశాల్లో నమోదైన మరణాలు దాదాపు 60 కాగా.. ఇరాన్లో ఇంతవరకు 1,650 మందికి పైగా చనిపోయారు. ఇరాన్లో కరోనా ఛాయలు మొదలైన కొత్తలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో క్రమేపీ ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చింది. ‘‘కరోనాతో ఇరాన్కు ముప్పేమీ లేదు.. వేరుగా ఉంచడం (క్వారంటైన్) అనేది రాతియుగపు నాటి చర్య..’’ ఇరాజ్ హారిర్చి కెమేరాల ముందు ఫిబ్రవరి చివరి వారంలో అన్న మాటలివి. మరుచటిరోజే ఆయనకు కరోనా సోకడంతో క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. హారిర్చి ఈ దేశంలో కరోనాపై పోరాడుతున్న ప్రత్యేక కార్యదళానికి అధిపతి కూడా. ఇరాన్లో ఇప్పుడు 21 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో ఆ దేశం ఇప్పుడు చర్యలు చేపట్టింది.
ఖోమ్ నగరంలో మొదలు..
ఇరాన్లో పర్షియన్ కొత్త సంవత్సరం(ఈనెల 20) వేడుకల నాటికి వైరస్ను కొంత కట్టడి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా శ్రద్ధ చూపలేదు. ప్రధాన నగరాల మధ్య రాకపోకలను నిలిపివేయడం, ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో నిషేధం విధించడం వంటి చర్యలేవీ చేపట్టలేదు. ఖోమ్ నగరం నుంచే ఇరాన్లో కరోనా విస్తరించింది. తొలిసారి రెండు కరోనా కేసులు ఫిబ్రవరి 19న ఖోమ్లోనే వెలుగు చూశాయి. ఇరాన్ అధికారులు కరోనా సమాచారం బయటకు రానీయలేదు. ఇస్లామిక్ విప్లవ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న నేపథ్యంలో దీన్ని బయటపెట్టి ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్లో ఫిబ్రవరి 21న పార్లమెంటు ఎన్నికలు కూడా జరిగాయి. అంతకు కొద్ది రోజుల ముందే బాగ్దాద్లో అమెరికా డ్రోన్ దాడిలో ఇరన్ అగ్రశ్రేణి జనరల్ సులేమీనీ హతమయ్యారు. కరోనా ఉనికిని బయటకు రానివ్వకుండా చేయడానికి ఈ పరిణామాలన్నీ కారణాలు కావచ్చని భావిస్తున్నారు.
చర్యలకు దిగిన ఇరాన్..
పరిస్థితి దిగజారిన నేపథ్యంలో ఇరాన్లో కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. పర్షియన్ కొత్త సంవత్సర (ఫైర్ ఫెస్టివల్) వేడుకలను నిషేధించారు. షియాల కీలక ప్రాంతాలతో పాటు, అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. అన్ని సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలను వాయిదా వేశారు. శుక్రవారం ప్రార్థనలను నిలిపివేయడంతో పాటు, రెండో దశ శాసన ఎన్నికలను కూడా వాయిదా వేశారు. నగరాలను విడిచి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు. 13 ప్రావిన్సుల్లో ప్రత్యేక బృందాలను ఇరాన్ నియమించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా 85,000 మంది ఖైదీలను తాత్కాలిక సెలవుపై విడుదల చేశారు. ప్రజలు ప్రయాణాలను కొనసాగిస్తూ.. ఆరోగ్య సూచనలు పాటించకపోతే లక్షల సంఖ్యలో చనిపోయే ప్రమాదం ఉందని ఇరాన్ ప్రజలకు హెచ్చరించింది. అనవసర ప్రయాణాలను నిషేధిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖామెనెయ్ అరుదైన రీతిలో ఫత్వా జారీ చేశారు. అయితే ప్రార్థన ప్రాంతాలను మూసివేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా 14,436కి చేరిన కరోనా మృతులు