దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలుచుకొని చరిత్రను తిరగరాసింది. ఆ సినిమాలోని నాటు నాటు పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. కాగా ఈ ఆస్కార్ ఈవెంట్లో కీరవాణి, చంద్రబోస్తో పాటు ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
అయితే ఆస్కార్ లైవ్ ఈవెంట్లో పాల్గొనడానికి రాజమౌళి భారీగానే ఖర్చుచేసినట్లు సమాచారం. ఈ ఈవెంట్ టికెట్ కోసమే ఆయన కోటిన్నర రూపాయలకు పైగా వెచ్చించినట్లు చెబుతున్నారు. విజేతలకు మాత్రమే ఆస్కార్ లైవ్ ఈవెంట్లో టికెట్స్ కొనుగోలు చేయకుండా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. వారితో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ను మాత్రమే ఉచితంగా వేడుకను వీక్షించడానికి అనుమతి ఇస్తారు. మిగిలిన వారు ఆస్కార్ ఈవెంట్ను లైవ్గా వీక్షించాలంటే టికెట్ కొనాల్సిందే. ఈ ఏడాది ఒక్కో టికెట్ ధరను ఇరవై లక్షల అరవై వేల రూపాయలు ఫిక్స్ చేశారట. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్చరణ్తో పాటు మిగిలిన వారందరూ టికెట్స్ కొనుగోలు చేసి ఆస్కార్ ఈవెంట్కు హాజరైనట్లు సమాచారం.
కీరవాణి, చంద్రబోస్ మాత్రమే విన్నర్స్ క్యాటగిరీలో ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలిసింది. ఆస్కార్ ఈవెంట్ టికెట్స్ కోసం రాజమౌళి దాదాపు కోటి నలభై ఐదు లక్షల రూపాయలు వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. అది పెద్ద మొత్తమే అయినా తమ సినిమాకు అవార్డును ప్రకటించే క్షణాలను ప్రత్యక్షంగా ఆనందించడం కోసం రాజమౌళి భారీగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న ఆర్ఆర్ఆర్ టీమ్ వేర్వేరుగా ఇండియాకు తిరిగివచ్చారు. మార్చి 15న ఎన్టీఆర్.. భారత్కు వచ్చారు. రాజమౌళితో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. రామ్చరణ్ కూడా శుక్రవారమే ఇండియాకు వచ్చారు. అనంతరం దిల్లీలో జరిగిన ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ పలు విషయాలను చర్చించారు.
మెగాపవర్ స్టార్ రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. దీనికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేగాక గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. కాగా, దీంట్లోని 'నాటు నాటు' పాటను సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రత్యేకంగా ఈ పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ రక్షిత్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు.