డేటింగ్ యాప్ల వలలో చిక్కుకుని అమ్మాయిలతో చాటింగ్ కోసం అరవై ఏళ్ల వైద్యుడు రూ.70లక్షల దాకా సమర్పించుకున్నాడు. తీరు మార్చుకోకుండా డేటింగ్ యాప్ల్లో చాటింగ్ చేస్తుండటంతో కుటుంబ సభ్యులు అతని ఖాతాలు స్తంభింపజేశారు. హైదరాబాద్లోని ముషీరాబాద్లో భార్యాబిడ్డలతో కలిసి ఉంటున్న డాక్టర్ రమేశ్ గుజరాత్లో వైద్యం చేస్తుంటాడు. నెలలో కొంతకాలం గుజరాత్లో, మిగతా రోజులు హైదరాబాద్లో ఉంటాడు.
రికార్డు చేసి..
ఆరు నెలల క్రితం ఓ డేటింగ్ యాప్లో పరిచయమైన యువతితో కొంతకాలం వాట్సాప్లో చాటింగ్ చేశాడు. తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. ఓ రోజు ఆ అమ్మాయి ఈ వైద్యుడిని ప్రేమిస్తున్నానంటూ వల విసిరింది. ఇద్దరూ కలిసి ‘న్యూడ్ వీడియో(నగ్నంగా)’ కాల్స్ చేసుకున్నారు. ఈ బాగోతాన్ని ఆ మాయలేడీ రికార్డ్ చేసింది. కోరినంత డబ్బులివ్వకపోతే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించింది. దీంతో ఆ వైద్యుడు 2020 నవంబరులో దఫదఫాలుగా ఆమెకు రూ.39 లక్షల వరకు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ డిమాండ్ పెరుగుతుండటంతో తట్టుకోలేక చివరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
తీరు మారలేదు..
అయినా తీరు మార్చుకోకుండా డేటింగ్ యాప్ల్లో ఇతర అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల రోజుల్లో మరో రూ.30 లక్షలు ముట్టజెప్పాడని పోలీసులకు వివరించారు. ఎందుకు అనవసరంగా డబ్బులు తగలబెడుతున్నారని భార్యాబిడ్డలు ప్రశ్నిస్తే.. ‘నా డబ్బు నా ఇష్టం’.. ‘నాకు నచ్చినట్లు ఉంటా.. నచ్చినట్లు ఖర్చు చేస్తాను’ అంటూ ఎదురుదాడికి దిగుతున్నాడని సైబర్ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్, ఇన్స్పెక్టర్ ప్రశాంత్ల వద్ద వాపోతూ ఫిర్యాదు చేశారు. బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేయించాలని కోరారు. దీంతో పోలీసులు ఆ వైద్యుడి ఖాతాను స్తంభింపచేయించారు.
నా డబ్బులొస్తాయా.?
అయితే ఇప్పుడా ఖాతాను తెరిపించాలంటూ పోలీసులను ఆ వైద్యుడు కోరుతున్నాడు. కుటుంబసభ్యుల కోరిక మేరకు ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్ ఆ వైద్యుడితో మాట్లాడారు. ‘ఇకపై గుర్తుతెలియని వారికి డబ్బులు బదిలీ చేయనని రాతపూర్వక హామీ ఇస్తేనే ఖాతాను తెరిపిస్తాం’ అని తెలిపారు. కాగా, నవంబరులో రూ.39 లక్షలు పోగొట్టుకున్న తరువాత సార్.. నా డబ్బులు దొరుకుతాయా.. నిందితులను పట్టుకున్నారా?’ అంటూ రోజూ సైబర్ పోలీసులను అడుగుతుండడం కొసమెరుపు.
ఇదీ చదవండి: విజయవాడ మేయర్గా రాయన భాగ్యలక్ష్మి