ప్రస్థానం మొదలైందిలా..
- 1888 తర్వాత ఓల్డ్టౌన్ ప్రాంతంలో, పోర్టు దగ్గర వైజాగపట్నం టౌన్ రైల్వేస్టేషన్ను అప్పటి ‘ఈస్ట్కోస్ట్ స్టేట్ రైల్వే’ నిర్మించింది. అక్కడి నుంచి 1893లో తొలి సరకు రవాణా (గూడ్స్’) రైలును, 1894లో ప్రయాణికులకు తొలి ప్యాసింజర్ రైలును నడిపింది.
- ఇప్పుడున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ను 1969-72 మధ్య నిర్మించారు. దీన్ని ‘వాల్తేరు రైల్వే స్టేషన్’ అని పిలిచేవారు. ప్రారంభంలో ఇక్కడివరకే ప్యాసింజర్ రైళ్లొచ్చి ఆగేవి. ఓల్డ్టౌన్కు వెళ్లాల్సినవారి కోసం ఇక్కడి నుంచి ప్రత్యేక షటిల్ సర్వీసు రైలుండేది.
- 1973 ప్రాంతంలో ఓల్డ్టౌన్ రైల్వేస్టేషన్ను మూసేశారు. అప్పటి నుంచి వాల్తేరు రైల్వే స్టేషన్ మరింత కీలకంగా మారింది. ఆ తర్వాత ఈ స్టేషన్కు 1987లో ‘విశాఖపట్నం’ అని పేరుపెట్టారు. అలా మొదలైంది మరో ప్రస్థానం.
నౌకాశ్రయంతో నగరానికి ఎంతో గుర్తింపు వచ్చింది. స్టీల్ప్లాంట్ ఏర్పాటయ్యాక నగర పేరు ప్రఖ్యాతులు మరింతగా విస్తరించాయి. ప్రయాణాలు కూడా పెరిగిన నేపథ్యంలోనే వాల్తేరు రైల్వేస్టేషన్కు నాంది అయింది. 1969-72 మధ్య నిర్మాణాలు పూర్తి చేశారు. అప్పట్లో స్టీమ్ లోకోలే ఎక్కువ. దాని షెడ్ కూడా స్టేషన్ పక్కనే ఉండేది. కేకే లైన్లో సరకు రవాణా చేసేందుకు కేవలం 3, 4 మాత్రమే డీజిల్ లోకోలు ఉండేవి. ఇప్పుడు మాత్రం దేశంలోనే ప్రఖ్యాత స్టేషన్లలోనే ఒకటిగా నిలిచింది. ఏకంగా కొత్తగా ఏర్పడే దక్షిణకోస్తా రైల్వే జోన్కు కేంద్రం కానుంది.
అప్పుడు: ప్రారంభంలో హావ్డా - చెన్నై కోరమాండల్, మెయిల్, హావ్డా-హైదరాబాద్ ఈస్ట్కోస్ట్, భువనేశ్వర్-ముంబయి కోణార్క్, పూరి-తిరుపతి జనతా, నిజాముద్ధీన్ సమతా రైళ్లు ఉండేవి. 1976లో విశాఖ నుంచి గోదావరి రైలు మొదలైంది. అప్పట్లో రోజుకు 14 రైళ్లు వాల్తేరు స్టేషన్ మీదుగా రాకపోకలు చేసేవి.
ఇప్పుడు: వాల్తేరు డివిజనే సొంతంగా 37 రైళ్లు విశాఖ నుంచి నడుపుతోంది. రోజు వారీ విశాఖకు 112 రైళ్లు వచ్చి వెళ్తుంటాయి. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో రైళ్ల రాకపోకల్ని పరిమితంగా చేశారు.
4 ప్లాట్ఫామ్ల నుంచి
మొదట్లో 4 ప్లాట్ఫామ్లను మాత్రమే నిర్మించారు. 1996లో వాటిని 6కు పెంచారు. ఆ తర్వాత 2011-13లో 8కి తీసుకొచ్చారు.
తొలి ర్యాంప్ స్టేషన్
- వాల్తేరు రైల్వేస్టేషన్గా ఉన్నప్పుడు కేవలం ఒక్కటే ఫుట్ఓవర్ బ్రిడ్జి (ఎఫ్వోబీ) ఉండేది. ఆ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ దాన్ని కూల్చేసి సరికొత్తగా కట్టారు.
- 2016-18 మధ్య 3 ఎఫ్వోబీల్ని తెచ్చారు. ప్రస్తుతం పోస్టాఫీసు పక్కనున్న ఎఫ్వోబీలో అన్ని ప్లాట్ఫామ్లకు వెళ్లేందుకు ర్యాంప్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రయత్నం దేశంలోనే తొలిసారి.
హుద్హుద్ తరువాత
2014లో హుద్హుద్ తుపాను ధాటికి రైల్వే స్టేషన్ బాగా దెబ్బతింది. బాగు చేసేందుకు సుమారు రూ.15 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో అన్ని ఫ్లాట్ఫామ్లను నవీకరించడంతో పాటు ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఎఫ్వోబీలు మార్చేశారు. గత రెండేళ్లుగా విశాఖ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ ప్రాజెక్టులో మరో రూ.10కోట్లు ఖర్చుపెట్టి మెరుగులు దిద్దితున్నారు.