విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు అతి సమీపంలో ఉన్న మేఘాద్రి గడ్డ రిజర్వాయర్లోని నీటిని పారిశ్రామిక, తాగు, సాగు నీటి అవసరాలకు వినియోగిస్తారు. ద్రోణంరాజు సత్యనారాయణ సాగర్గా ఈ రిజర్వాయర్కి పేరు. ఎల్జీ పాలిమర్స్ స్టైరీన్ గ్యాస్ లీకేజీ జరిగిన నాటి నుంచి ఈ రిజర్వాయర్లోని నీటి వినియోగం నిలిపివేశారు. విశాఖ మహానగర పాలక సంస్థ తాగు నీటి అవసరాల కోసం రెండు టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్ నుంచే తీసుకుంటారు. స్టైరీన్ ఆవిరి లీకేజీ తర్వాత రిజర్వాయర్లోని నీరు కలుషితం అయిందని గుర్తించి.. ఈ నీటిని జీవీఎంసీ వినియోగించడం లేదు.
రిజర్వాయర్లోని నీటిని నీరి సంస్థ నిపుణుల బృందం పరీక్షించింది. ఐదు విధాలుగా మేఘాద్రి గడ్డ రిజయర్వాయర్లోని నీటిని పరీక్షించినట్లు వివరించారు. వివిధ శాతాలుగా రిజర్వాయర్లోని నీటికి మంచి నీటికి కలిపి పరీక్షించారు. 96 గంటల పాటు ఒక్కో తొట్టెలోను ఐదు ఆరోగ్యవంతమైన చేపలను ఉంచగా... వందశాతం మేఘాద్రి గడ్డ నీరు ఉన్న తొట్టెలో 72 గంటల తర్వాత రెండు చేపలు చనిపోయినట్టు గుర్తించారు.
రిజర్వాయర్ నీటి పీహెచ్ స్థాయి 7.77 గా ఉన్నట్టు గుర్తించామని వివరించింది. బయో అసెస్సీ పరీక్షలో భాగంగా నిర్వహించిన ఫలితాల అధారంగా 60 శాతం జీవజాలం మాత్రమే ఈ నీటిలో జీవించగలదని తేల్చింది. అందువల్లనే ఈ నీరు నేరుగా మానవ అవసరాలకోసం వినియోగించవద్దని స్పష్టం చేసింది. యాక్టివేటెడ్ కార్బన్ అడ్సార్పన్ పద్ధతి, లేదా కంబైన్డ్ ఓజోన్ యాక్టివేటెడ్ కార్బన్ ట్రీట్మెంట్ పద్దతులలో ఆర్గానిక్ కంటెట్ను రిజర్వాయర్ నీటి నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది.
పీహెచ్ 7.7 పరిమితుల్లోనే ఉన్నప్పటికీ స్టైరీన్ బీడీఎల్ 0.0015 పీపీఎం ఉందని నిపుణులు తెలిపారు. నీటిలో ఘనపదార్థాలు 270 ఎంజీ/లీ, గాఢత 88 ఎంజీ/లీ., సోడియం 48 ఎంజీ/లీ, ఆయిల్ గ్రీజ్ 10 ఎంజీ/లీ ఉన్నట్టు గుర్తించారు. బయోలాజికల్ ఆక్సిజెన్ డిమాండ్ 4.7ఎంజీ/లీ ఉందని నిపుణులు ఎన్జీటీ నివేదికలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి : తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి