ఓ పక్క దేశవ్యాప్తంగా కరోనా రోగులకు బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తుండగా.. మరోపక్క జిల్లా ఆస్పత్రులకు కేంద్రం అందించిన విలువైన వైద్య పరికరాలు ఏడాది కాలంగా నిరుపయోగంగా పడి ఉంటున్నాయి. గతేడాది కరోనా మొదటి దశ సమయంలో ప్రధానమంత్రి కేర్స్ కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు దశల వారీగా వెంటిలేటర్లను ఇచ్చారు. 1,030 వెంటిలేటర్లు రాగా, వీటిలో కొన్నింటిని ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చారు.
ఇంకా కొన్ని ఆయా ఆస్పత్రుల ఆవరణలో అట్టపెట్టెల్లో మూలుగుతున్నాయి. ఇంకా కొన్ని ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లు అలంకారప్రాయంగా వదిలేశారు. ప్రతి పది పడకలకు ఒక అనస్తీషియా, 3 పడకలకు ఒక స్టాఫ్నర్సు ఉండాలి. మత్తు వైద్యులు, స్టాఫ్నర్సుల కొరతతో.. కర్నూలు, విశాఖ జిల్లాల్లో గతేడాది వచ్చిన కొన్ని వెంటిలేటర్లు నిరుపయోగంగా ఉండిపోయాయి.
నంద్యాల ఆసుపత్రిలో..
నంద్యాలలోని జిల్లా ఆసుపత్రిలో పాతవి 12 వెంటిలేటర్ల వరకు ఉండగా గతేడాది రెండు విడతలుగా పీఎంకేర్స్ కింద 60 అందజేశారు. మొత్తం 72 కాగా 34 వెంటిలేటర్లు పనిచేస్తున్నాయి. వీటిల్లో కొవిడ్ అత్యవసర సేవలకు 10, ఐసీయూ జనరల్ వార్డులో మిగిలిన 24 వెంటిలేటర్లను ఉంచారు. కొవిడ్ రోగులకు 10 వెంటిలేటర్లు సరిపోక.. రోగులను కర్నూలు సర్వజన వైద్యశాలకు పంపిస్తున్నారు. గంటన్నర ప్రయాణం చేసి కర్నూలు పెద్దాసుపత్రికి చేరేలోగా ఆక్సిజన్ స్థాయి తగ్గి రోగులు మరణిస్తున్నారు. సాంకేతిక సిబ్బంది లేనందున 20 కిపైగా వెంటిలేటర్లను అట్ట పెట్టెల్లో, మరికొన్ని హెచ్డీయూలోనే నిరుపయోగంగా ఉండిపోయాయి.
పాడేరులోనూ..
విశాఖపట్నంలోని పాడేరు జిల్లా ఆసుపత్రికి గతేడాది 60 వెంటిలేటర్లు అందాయి. అప్పట్లో విశాఖలోని విమ్స్కు 35 తరలించారు. మిగిలిన 25 ఏడాదిగా నిరుపయోగంగా ఉంటున్నాయి. ఇక్కడ మత్తు వైద్యులు లేరు. అత్యవసర వైద్యానికి కొవిడ్ రోగులు 200 కి.మీ.లు ప్రయాణించి కేజీహెచ్కు వెళ్లాల్సి వస్తోంది. వెంటిలేటర్ వైద్యం అందక పాడేరు పరిధిలో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. వెంటిలేటర్లలో ఉపయోగంలో లేనివి ఎన్ని ఉన్నాయో వివరాలు ఇవ్వాలని.. ఎక్కడ తక్కువుంటే అక్కడికి వాటిని పంపించాలంటూ రెండురోజుల కిందట కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని జిల్లాల వైద్యాధికారులను కోరినట్లు సమాచారం.
ఇవీ చదవండి: