TDP Leaders On Power Cut: ముఖ్యమంత్రి జగన్ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో విద్యుత్ కోతలు మెుదలయ్యాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. విద్యుత్ వ్యవస్థను ముఖ్యమంత్రి భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. జగన్ చేతకానితనం వల్ల 3,200 మెగావాట్ల విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని అన్నారు. ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితి ఉంటే రానున్న వేసవి కాలంలో విద్యుత్ కోతలు ఏ విధంగా ఉంటాయో అర్థమవుతోందన్నారు. జగన్ తన అహంకారపూరిత వైఖరి కారణంగా రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని దేవినేని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అంధకారానికి జగన్ అసమర్థతే కారణం: ఎమ్మెల్యే ఏలూరి
రాష్ట్రంలో జగన్నన్న విద్యుత్ కోతల పథకం ప్రారంభమైందని.. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎద్దేవా చేశారు. అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం చేతకాని తనం వల్ల విద్యుత్ రంగం కుప్పకూలిందని సాంబశివరావు ఆరోపించారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడున్నాయి ?: మంత్రి బాలినేని
Minister Balineni On Power Cut: రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడున్నాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. సాంకేతికంగా ఎక్కడో చిన్న లోపం వచ్చి రెండు రోజులు సరఫరాలో అంతరాయం కలిగితే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోని విద్యుత్ బకాయిల భారాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నామని అన్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని, రాష్ట్రంలో విద్యుత్తు కోతలు ఉండవని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి
Protest for PRC: సమ్మెకు మద్దతుగా.. నల్లబ్యాడ్జీలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలు