మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా.. నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులను ఆయా కళాశాలలు పరిశ్రమలకు అనుగుణంగా తయారు చేస్తున్నాయని సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగుతున్న రాష్ట్ర స్థాయి నైపుణ్య శిక్షణా పోటీలకు సజ్జల రామకృష్ణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని సజ్జల తెలిపారు. మూసపద్ధతిలో చదువులు ఉండటం వల్ల కొన్ని ఉద్యోగాలకే యువత పరిమితం అవుతున్నారని కేఎల్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవీష్ అన్నారు. అయితే ఇప్పుడిప్పుడే యువత నైపుణ్యంలో మార్పు వస్తోందని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయన్నారు. ఇక్కడే జరిగే రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీల అనంతరం.. బెంగళూరులో జాతీయ స్థాయి.. ఆ తర్వాత 2022లో షాంగైలో జరిగే నైపుణ్య పోటీలకు ఎంపిక ఉంటుందని హావిష్ తెలిపారు. నగరంలో కెఎల్ యూనివర్సిటీతోపాటు మరో 9 కళాశాలల్లో ఈ రాష్ర్ట స్థాయిలో నైపుణ్య పోటీలు జరగుతున్నాయి.
ఇదీ చదవండి:
SC COMMISSION: రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నాం: జాతీయ ఎస్సీ కమిషన్