Pawan On Digital Campaign: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా.. గత మూడు రోజులుగా లక్షల సంఖ్యలో ట్వీట్లు చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నట్లు జనసేన అధినేత పవన్ చెప్పారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అనే హ్యాష్ ట్యాగ్తో చేసిన ఈ సామాజిక మాధ్యమ ప్రచారం 697.4 మిలియన్ల మందికి చేరువైందన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అనే నినాదం తెలుగువారందరినీ భావోద్వేగంతో ఏకం చేసి పోరాడేలా చేసిందని పవన్ అభిప్రాయపడ్డారు. ఉక్కు పరిరక్షణను రాష్ట్ర ఎంపీలకు మరోమారు గుర్తు చేస్తూ వారికి తమ బాధ్యతను తెలియచెప్పేలా సామాజిక మాధ్యమాల్లో అన్ని వర్గాల ప్రజలూ ఉద్యమ స్ఫూర్తితో పోస్టులు పెట్టారన్నారు.
జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారని పవన్ కొనియాడారు. రాష్ట్రం నుంచి పార్లమెంట్కు వెళ్లిన ప్రతీ లోక్సభ, రాజ్యసభ సభ్యుడిని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శించాలని ఎంపీలను ట్యాగ్ చేస్తూ ట్విటర్ వేదికగా కోరారన్నారు.
పెళ్లి పందిళ్ళల్లోనూ వధూవరులు, అతిథులు విశాఖ ఉక్కును కాపాడుకోవాలని కోరుకొంటూ ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తులు చేయడం చూస్తుంటే.. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ప్రజలు ఎంతగా తపిస్తున్నారో అర్థమవుతోందన్నారు. ఇదే స్ఫూర్తి రాష్ట్ర ఎంపీల్లోనూ రావాలని పవన్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి
Pawan On Visaka Steel Plant: విశాఖ ఉక్కు పరిరక్షణే లక్ష్యంగా.. డిజిటల్ క్యాంపెయిన్: పవన్