‘రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తక్షణమే టీకాలు వేస్తేనే, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. సీఎం మాత్రం దీనిని చిన్న అంశంగా తీసుకోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఇకనైనా కట్టడికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి’ అని విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆధ్వర్యంలో తెదేపా, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నేతలు ఆదివారం వర్చువల్ సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.
లాక్డౌన్ అవసరం
సీఎం జగన్ దీనిని తొలుత పారాసిట్మాల్, బ్లీచింగ్ అంటూ మొదలు పెట్టి, సీరియస్గా తీసుకోలేదు. డబ్బులు కడతాం, మాకు వ్యాక్సిన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నమే చేయలేదు. ఈ చెయిన్ను ఆపాలంటే లాక్డౌన్ అవసరం. ఈ సీఎం ఎవరితో మాట్లాడరు. ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోరు. 300-400 మంది సలహాదారులు ఉన్నారు. వారికి లక్షల జీతాలు ఇస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5-10 లక్షలు పరిహారంగా ఇవ్వాలి. ఇంజినీరంగ్ కళాశాలల్లో పడకలు ఏర్పాటు చేసి, ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తే ఇంత ఇబ్బందులు ఉండేవి కాదు.
- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
సీఎం ప్రాధాన్యం ఇవ్వలేదు
15 నెలల తర్వాత కూడా సీఎం కొవిడ్కు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. గతవారం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయంపై సీఎం సమీక్ష జరిపారు. తన సొంత ఎజెండాలు పక్కనపెట్టి ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కాపాడడమే ఎజెండాగా సీఎం పనిచేయాలి. నీకే డబ్బులిస్తాం వ్యాక్సిన్ తీసుకురా.. అంటూ మంత్రి కొడాలి నాని సిగ్గులేకుండా చంద్రబాబుకు సవాల్ విసురుతున్నారు. ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లకు, దుకాణాల్లో పనిచేసే వారికి నెలకు రూ.10 వేలు చొప్పున ఇవ్వాలి
- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి
ఈ సమయంలో సీఎం, ప్రధానికి మద్దతు ఇచ్చేలా వ్యవహరించడం సరికాదు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి. అన్నిపార్టీల మద్దతు తీసుకోవాలి. కరోనా మొదటి, రెండో విడతకు మధ్య 5 నెలల సమయం ఉంటే, మోదీ దానిని రాజకీయాలకు వాడుకున్నారు. ఎన్నికల్లో గెలుపుపైనే దృష్టిపెట్టి, ప్రజల ఆరోగ్యాన్ని మరచిపోయారు. టీకాలకు కేంద్రం, రాష్ట్రం, ప్రైవేటుకు వేర్వేరు ధరలు ఏమిటి? అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.7,500, 25 కేజీల బియ్యం చొప్పున ఆరు నెలలు అందజేయాలి
- మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
ఈ సమయంలో కక్ష సాధింపులా?
ఏపీకి పది ఆక్సిజన్ ప్లాంట్లు మంజూరైతే, ఒక్కటే పూర్తిచేయడం ఏమిటి? మే 15కి వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుంది. ఇప్పుడు ఉన్నది 480 మెట్రిక్ టన్నులే. ముందు చూపు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. చంద్రబాబుకు నోటీసు ఇచ్చేందుకు సీఐడీ బృందం కర్నూలు నుంచి హైదరాబాద్ బయలుదేరిందని వార్తలు టీవీల్లో వస్తున్నాయి. ఈ సమయంలో కక్ష సాధింపులా? ఏయే తెదేపా నేతలను ఇబ్బందులు పెట్టాలని అనుకుంటున్నారో ఆ జాబితా ఇస్తే మేమే లొంగిపోతాం.
- కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తెదేపా
ఒక్కొక్కరి వైద్యానికి రూ.2 లక్షలు కేటాయించాలి
కొవిడ్ చికిత్సకు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు, కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం ఇచ్చే మొత్తం సరిపోదు. కార్పొరేట్ స్థాయిలో సరైన వైద్యంతో ప్రాణాలు నిలబడాలంటే ఒక్కో రోగికి రూ.2 లక్షలు చొప్పున వైద్య ఖర్చుకు ప్రభుత్వం అంగీకరించాలి. అంత్యక్రియలకు రూ.15 వేలు, క్వారంటైన్లో ఉంటే రూ.2 వేలు ఇస్తామని అన్నారు. ఎక్కడా అమలు కావడం లేదు.
- నిమ్మల రామానాయుడు, తెదేపా
సీఎం క్షేత్రస్థాయిలో పర్యటించాలి
ప్రపంచంలో కేసులు తగ్గుతుంటే ఇక్కడ పెరుగుతున్నాయి. మోదీ విఫలనాయకుడు. జగన్రెడ్డి ఆయన్ను పొగుడుతున్నారు. కొత్త వేరియంట్ వస్తోందని శాస్త్రవేత్తలు చెప్పినదాన్ని చంద్రబాబు పేర్కొంటే, ఆయనపై కేసు పెట్టారు. క్షేత్రస్థాయిలో సీఎం పర్యటించాలి.
- తులసిరెడ్డి, కాంగ్రెస్
క్షేత్రస్థాయి వరకు ఒత్తిడి తేవాలి
ఆసుపత్రుల్లో పడక దొరకలేదని, సరైన వైద్యం అందలేదని, ఆక్సిజన్ లేదని తెలిసిన బాధితులు ఫోన్చేసి చెబుతుంటే, ఓ వైద్యుడిగా చెప్పలేనంత బాధ కలుగుతోంది. ఈ సమయంలో కొవిడ్ను ఎదుర్కునేందుకు రూ.2-3 వేల కోట్లు వెచ్చించడం ఈ ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు. నాలుగు పార్టీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం.
- శైలజానాథ్, పీసీసీ అధ్యక్షుడు
- ఈనాడు, అమరావతి
ఇదీ చదవండి