ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాల కన్నా... రద్దు చేసిన పథకాలే అధికమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావ్ విమర్శించారు. జగన్ది రద్దుల ప్రభుత్వమని...,తన ఏడాది పాలనలో ఆత్మస్తుతి- పరనింద తప్పా ఆత్మవిమర్శ లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వానికి 25 వేల కోట్ల అధిక ఆదాయం వచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఏడాదికి సరాసరి 26 వేల కోట్లు అప్పు చేస్తే జగన్ తొలి ఏడాదే 82 వేల కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు. దాడులు, నిధుల దుబారా , పౌర హక్కుల హరణ, రాజ్యంగ సంక్షోభ చర్యలు తప్ప ఏ ఘనత సాధించారని నిలదీశారు. వైకాపా ఏడాది పాలన గొప్పగా ఉందని పాలకులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జగన్ అభాసుపాలు చేశారని మండిపడ్డారు. రాజ్యాంగ విలువలను కాలరాశారని దుయ్యబట్టారు. ఏడాదిలోనే రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి పేదల నడ్డి విరిచారని ధ్వజమెత్తారు. ఏడాదిలో ప్రజలపై 30 వేల కోట్ల రూపాయల భారం మోపారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు అమలు చేసిన 34 సంక్షేమ పథకాలను రద్దు చేశారని విమర్శించారు.