రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠాశలల్లో దశల వారీగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు భాషా పరిరక్షణ సంఘాల ప్రతినిధులు, భాషాభిమానులు వ్యతిరేకించారు. తెలుగు మాధ్యమంలో విద్యాబోధన అంశంపై విజయవాడ గాంధీనగర్లో చర్చాగోష్ఠి నిర్వహించారు. శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తొలగించి ఆ స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్ల భవిష్యత్తులో అనేక అనర్థాలు వాటిల్లుతాయని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. పిల్లల్లో మానసిక శక్తి పెరగాలన్నా.. సృజనాత్మకత పెరగాలన్నా.. మాతృభాషలో విద్యాబోధనతోనే సాధ్యమని.. పరిశోధనలు చెబుతన్న విషయాన్ని మండలి బుద్ధప్రసాద్ గుర్తు చేశారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు తెలుగు భాష పట్ల, విద్యా విధానంపై విధానం లేకపోవడం బాధకరమన్నారు. గత ప్రభుత్వాలు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించినా ఆందోళన చేసి అడ్డుకున్నామని.. ఇప్పుడు అలా చేస్తే.. ఎదురు దాడి చేస్తున్నారని బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషాభివృద్ధికి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. భాషను బతికించుకోవాలన్న తపనతోనే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రభుత్వ నిర్ణయంపై అభ్యతంరం వ్యక్తం చేస్తే.. వారిని ముఖ్యమంత్రి అపహాస్యం చేయడం తదగన్నారు.
భాష నశిస్తే జాతి నశిస్తుందని.. భాషను, జాతిని రక్షించుకుంటూనే పరాయి భాషను నేర్చుకోవాలని తెలుగు భాషా అభిమానులు అభిప్రాయపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో మాతృభాషను పరిరక్షించుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని గుర్తు చేశారు. తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలిపేందుకు పోస్టు కార్డులు పంపే కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. కమిటీ వేసి అధ్యయనం చేసి ఆ పై తగు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే ఆంగ్ల మాధ్యమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేధావులు డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఈనెల 17 న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద దీక్షకు దిగాలని మేధావులు, భాషాభిమానులు నిర్ణయించారు.
ఇదీ చదవండి: