అంతకంతకూ పెరిగిపోతున్న ఇంధన ధరలు.. ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలవైపు చూసేలా చేస్తున్నాయి. ఇంధనం ఆదాతో పాటు.. పర్యావరణహితం దృష్ట్యా ప్రభుత్వాలు కూడా ఈ-వాహనాలకు ప్రాధాన్యమిస్తూ.. ప్రోత్సహిస్తున్నాయి. ఇలా వీటి విక్రయాలు జోరందుకున్న సమయంలో... ఈ-బైక్లు పేలిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదాలు.. భవిష్యత్ ఆశాదీపంగా మారిన విద్యుత్ వాహన రంగంపైనే అనుమానాలు పెంచుతున్నాయని విక్రయదారులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోని పలు ప్రాంతాలు సహా రాష్ట్రంలో తాజాగా విజయవాడలో ఈ-బైక్లు పేలిన ఘటనలపై వాహనదారులు, నిపుణులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ వాహనాలు నడిపే సమయంలో.. అలాగే ఛార్జింగ్ పెట్టిన సమయంలో.. బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోతున్నాయి. దీని వల్ల వాహనాలు నడిపే వ్యక్తులు, ఇళ్లలోని వారు చనిపోతున్న దుర్ఘటనలు తరచూ సంభవిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఈ-వాహనాలను కొనుగోలు చేసిన వారు.. వీటిని వాడాలా వద్దా అన్న మీమాంసలో పడిపోయారు.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగే కొద్దీ.. వాటిలో వాడే బ్యాటరీల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని కంపెనీలు మాత్రమే అన్ని ప్రమాణాలనూ పాటిస్తూ బ్యాటరీలను రూపొందిస్తుండగా.. చాలా వరకు నాసిరకమైనవి వినియోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇలా బ్యాటరీల నాణ్యతతో పాటు... ఛార్జింగ్ పెట్టే విధానంపై అవగాహన లేమి వంటి అనేక కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని వివరిస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు, బ్యాటరీ సంస్థలకు అనుమతులిచ్చే విషయంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని.. నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: విజయవాడలో ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి