చిన్నారులు, మహిళలపై దాడులు చేసిన 632 మంది నిందితులపై నేర చరిత్రను తెరచి నిఘా పెంచుతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు . ఈ ఏడాది రాష్ట్రంలో ఆరు శాతం నేరాలు తగ్గాయని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దిశ హత్య కేసు అనంతరం రాష్ట్రంలో దిశ చట్టాన్ని అమలు చేశామన్నారు. 49 జీరో ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అజ్ఞాతంలో ఉంటున్న 1600 మంది నిందితుల్లో 927 మంది ఆచూకీ తెలుసుకుని వారిపై నిఘా పెట్టామని డీజీపి వివరించారు. 2020లో మహిళల భద్రతకే ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.
9 స్కోచ్ అవార్డులు...
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు 9 స్కోచ్ అవార్డులు దక్కటం గర్వకారణమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. డీఎస్సీఐ, జి-ఫైల్స్కు ప్రధాని ప్రశంసలు అందటం రాష్ట్ర పోలీసు పనితీరుకు నిదర్శనమన్నారు. పాకిస్తానీ వలపు వలలో చిక్కుకుని దేశ అంతర్గత భద్రత సమచారాన్ని చేరవేస్తోన్న ఏడుగురు నేవీ అధికారులను ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరుతో చాకచక్యంగా పట్టుకున్నామని... మావోయిస్టు ల ప్రాబల్యంను తగ్గించామని డీజీపీ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసుల మిస్టరీని ఛేదించినట్లు పేర్కొన్నారు.
2019లో కేసుల నమోదు వివరాలు...
2019లో లక్షా 12 వేల 697 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా విశాఖపట్నం రూరల్లో 5వేల 388 కేసులు, తక్కువగా నెల్లూరులో 6 వేల 179 కేసులు నమోదయ్యాయి. భౌతికదాడుల్లో ఈ ఏడాది మొత్తం 858 కేసులు... 931 కిడ్నాప్ కేసులున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఏకంగా 140 శాతం ఇసుక దోపిడీ కేసులు పెరిగాయి. 2019లో 3 వేల 390 దొమ్మీ కేసులు నమోదయ్యాయి. 2018లో 10 వేల 69 దొంగతనం కేసులు నమోదవ్వగా... 2019 లో 5 శాతం పెరిగాయి.
సైబర్ క్రైం నేరాల వివరాలు 2018-2019.
సైబర్ మిత్ర యాప్ ద్వారా అధికంగా ప్రజలు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. 2018లో 1414 సైబర్ కేసులు నమోదు కాగా, 2019లో 2165 కేసులు నమోదయ్యాయి. 2019లో 430 కేసులు నమోదు కాగా గతేడాదితో పోలిస్తే 20 శాతం కేసులు పెరిగాయని డీజీపీ తెలిపారు.
రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా పెరిగాయని.. వీటిని తగ్గించేందుకు చర్యలు చేపడతామన్నారు. పోలీసుల ప్రవర్తనలో మార్పులు రావాలని డీజీపీ సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల గోడు విని సమస్యలను పరిష్కరించాలన్నారు. స్పందన కార్యక్రమానికి ఇప్పటి వరకు 55 వేల పైగా ఫిర్యాదులు అందగా 90 శాతం పైగా సమస్యలు పరిష్కరించామని సవాంగ్ తెలిపారు