ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమైన ఎయిడెడ్, మైనారిటీ పాఠశాలల స్వాధీనం, అన్ఎయిడెడ్గా కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్న బడుల నుంచి సిబ్బందిని వెనక్కి తీసుకునేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై స్పష్టతనిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తులతో సహా అప్పగించేందుకు, సిబ్బందిని మాత్రమే ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన యాజమాన్యాల నుంచి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
- పాఠశాలలను ఆస్తులతోపాటు అప్పగించేందుకు అనుమతి తెలిపిన విద్యా సంస్థలకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా, భేషరతుగా స్వాధీనం చేసుకుంటుంది. యాజమాన్యాలు స్థిర, చరాస్తులను అప్పగించాక అవన్నీ ప్రభుత్వ సంస్థలుగా మారతాయి. స్వాధీన ప్రక్రియ పూర్తయ్యాక విద్యాసంస్థల్లోని మిగులు ఆస్తుల్ని ప్రజావసరాలకు వినియోగించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
- ఆస్తులు అప్పగించేందుకు ఆమోదం తెలిపిన పాఠశాలల్లోని సిబ్బందిని ప్రభుత్వంలోకి తీసుకుంటారు. వారి కోసం సర్వీసు నిబంధనల్ని రూపొందిస్తారు. ఈ బడుల్లోని తాత్కాలిక(పార్ట్ టైమ్) సిబ్బందిని పొరుగు సేవల సిబ్బందిగా పరిగణిస్తారు.
- అన్ ఎయిడెడ్గా కొనసాగాలనుకునే పాఠశాలలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు ఇచ్చే గ్రాంట్లు, ఆస్తులను ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా అవసరాల కోసం వినియోగించకూడదు. ఒకవేళ ఆయా బడులకు ప్రభుత్వం ఉచితంగా, రాయితీపై లేదా మార్కెట్ విలువ ఆధారంగా భూమిని కేటాయిస్తే... దాన్ని ముందుగా పేర్కొన్న ప్రకారం మినహా ఇతర అవసరాలకు వినియోగించకూడదు. వివిధ సంస్థలు, దాతలు ఇచ్చిన భూముల విషయంలో ఇదే వర్తిస్తుంది.
ఇదీ చదవండి..
బియ్యం కార్డులున్న ప్రభుత్వ ఉద్యోగుల ‘లెక్క’ తేల్చండి !