ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, రాయితీలు ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకర స్థాయికి వ్యవహారం వెళ్లిందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రకటనలో పేర్కొంది. 30 ఏళ్లుగా గుర్తింపు కూడా లేని సంఘాలు.. ఇప్పుడు 30 రోజుల్లో గుర్తింపు తెచ్చుకున్నాయని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. 30 రోజుల్లో ఆ సంఘానికి గుర్తింపు ఇవ్వడం వెనక ప్రభుత్వ కుట్ర ఉందా? అనే అనుమానం కలుగుతోందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు విమర్శించారు. ఉద్యోగుల ప్రయోజనాలు పక్కన పెట్టి, ఉద్యోగ సంఘాలను చీల్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఎవ్వరితోనూ సంప్రదించకుండా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికిచ్చిన గుర్తింపు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకే శాఖ ఒకే ఉద్యోగ సంఘం మాత్రమే ఉండాలని ప్రభుత్వాన్ని బొప్పరాజు డిమాండ్ చేశారు. పెన్షనర్లకు డీఏ ఇచ్చే జీవోను కూడా విడుదల చేయాల్సిందిగా కోరారు. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల సంఘం సలహాలు కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వైకాపా నిరంకుశత్వంతో ప్రజలను బాధిస్తోంది: చంద్రబాబు