రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తగినంత మంది అద్యాపకులు ఉన్నారని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. జూనియర్ కళాశాలల్లో నియామకాలు లేవన్నది అవాస్తవమని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి .రామకృష్ణ వెల్లడించారు. కొత్తగా మంజూరైన 84 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించటం జరిగిందన్నారు. కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులను పూర్తిగా బదిలీ చేయటమనేది అవాస్తవమన్నారు. ఇంకా ఏమైనా బోధనా సిబ్బంది ఖాళీలుంటే విద్యార్థుల చేరిక మేరకు అతిథి అధ్యాపకుల ద్వారా ఖాళీలు భర్తీ చేసేందుకు తగు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అతి త్వరలో 237 మంది జూనియర్ లెక్చరర్స్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వం నియామకాలు జరుపనుందన్నారు. ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నట్లు తెలిపారు.
ఆన్లైన్లో కనిపించని ప్రైవేటు కళాశాలల పేర్లను పొందుపరుస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఇన్ టేక్ వివరాలు సరిగా నమోదు చేయని కారణంగానే ఆయా కళాశాలల పేర్లు ఆన్లైన్లో కనిపించలేదని బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసిన 208 కళాశాలలతో కలిపి మొత్తం 7 లక్షల 42 వేల 780 సీట్లు ఉన్నాయని ఎలాంటి సీట్ల కొరత లేదన్నారు. కొవిడ్ పరిస్ధితుల్లో ఫైర్ ఎన్వోసీ లేని కళాశాలలనూ 60 రోజుల గడువుతో అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేదని..,ఆన్లైన్ అడ్మిషన్ల గురించి మార్చిలోనే అన్ని కళాశాలలకు సర్క్యూలర్ ఇచ్చామన్నారు.
ఇదీచదవండి
ఆన్లైన్లో తప్పుడు సమాచారం .. పలు పాఠశాలల్లో పోస్టులు గల్లంతు