తిరుపతి గ్రామీణ మండలంలో స్వర్ణముఖి నది సుమారు 20 కి.మీ మేర విస్తరించి ఉంది. కాలూరుక్రాస్, గొల్లపల్లె, అడపారెడ్డిపల్లె, దుర్గసముద్రం, చిగురువాడ, కూపుచంద్రపేట, వేదాంతపురం, తనపల్లె, తిరుచానూరు, ముండ్లపూడి, పాడిపేట గ్రామాల మీదుగా స్వర్ణముఖి నది ఉంది. ఈ గ్రామాల మధ్యన 35 ఏళ్లకు ముందు స్వర్ణముఖిలో ప్రవహించే నీటిని నిల్వ చేసుకోవడానికి దుర్గసముద్రం, పాపిరెడ్డిపురం వద్ద, వడ్డిపల్లె, చిగురువాడ గ్రామాలకు మధ్యన రెండు చెక్డ్యాంలు, తనపల్లె క్రాస్ సమీపంలో ఓ చెక్ డ్యాం నిర్మించారు. వర్షాలు కురిసినప్పుడు స్వర్ణముఖిలో నీటి ప్రవాహం ప్రారంభమైతే ఈ చెక్డ్యాంల వద్ద నీళ్లు నిల్వ చేరేవి. సమీపంలోని గ్రామాల బోరు బావుల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందేవి. ఒకసారి స్వర్ణముఖి నది ప్రవహిస్తే సుమారుగా రెండు మూడేళ్లు తాగునీటికి సమీప గ్రామాల్లో ఇబ్బంది ఉండేదికాదు. వ్యవసాయానికి రెండేళ్లకు నీటికి కొరత ఉండదు. వర్షాలు తగ్గుముఖం పట్టినా స్వర్ణముఖిలో నదీ జలాల ప్రవాహాన్ని పరిశీలిస్తే ప్రతి ఐదేళ్లకు ఒకసారి భారీ వర్షాలు కురుస్తుండడంతో కచ్చితంగా స్వర్ణముఖి నది ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో 2001లో కురిసిన భారీ వర్షాలకు స్వర్ణముఖి ప్రవహించడంతో ఈ మూడు చెక్డ్యాంలు కొట్టుకుపోయాయి. ఆ తర్వాత వీటి గురించి ఎవరూ పట్టించుకోలేదు.
గ్రామీణంలో 2200 ఎకరాల్లో పంటలు
తిరుపతి గ్రామీణ మండలంలో సుమారు 10 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పాతికేళ్లకు ముందు మండలంలో వ్యవసాయం పైనే ప్రజలు ప్రధానంగా ఆధారపడి జీవనం సాగించేవారు. ఇప్పటికీ మండలంలో 1200 ఎకరాల్లో వరి, వేరుసెనగ, చెరకు పంటలు, వివిధ కూరగాయలు, 1000 ఎకరాల్లో మామిడి, అరటి, బొప్పాయి, జామ తదితర ఉద్యాన పంటలు పండిస్తున్నారు. వర్షాలు సకాలంలో కురవక, స్వర్ణముఖిలో నీటి ప్రవాహం లేకపోవడంతో బోరు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. నగరం దినదినాభివృద్ధి చెందుతూ మండలంలోకి విస్తరించింది. ఈ నేపథ్యంలో రైతులు భూములను రియల్టర్లకు విక్రయించేశారు. కొందరు ఇప్పటికీ వ్యవసాయం వదులుకోలేక, భూములను అమ్ముకోలేక ఉన్న అరకొర నీటితో పంటలు సాగుచేసుకుని జీవిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల రోజులుగా స్వర్ణముఖి నది ప్రవహిస్తోంది. నీళ్లు మాత్రం వృథాగా పోతున్నాయి. స్వర్ణముఖిలో చెక్డ్యాంలు ఏర్పాటు చేస్తే వర్షాలు భారీగా కురిసినప్పుడు నది ప్రవహిస్తే నీరు నిల్వ చేరి భూగర్భ జలాలు పెంపొందే అవకాశం ఉందని మండలంలోని రైతులు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపినా అనుమతి రాలేదు
స్వర్ణముఖిలో గుర్తించిన పలు చోట్ల చెక్డ్యాంలు నిర్మించడానికి గతంలో ప్రతిపాదనలు పంపించినా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ప్రతిపాదనలు అడిగితే అంచనాలు రూపొందించి నివేదికలు అందిస్తాం. - రవిశంకర్, ఏఈ, నీటిపారుదల శాఖ, తిరుపతి గ్రామీణ మండలం
ఇదీ చదవండి: విషాదం: