అత్యాధునిక సాంకేతికత, బలగాల శక్తియుక్తుల పరంగా తమకున్న ప్రత్యేకతలను చాటిచెప్పే విధంగా పోలీస్ డ్యూటీమీట్ను నిర్వహించేందుకు......రాష్ట్ర పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది. తిరుపతి వేదికగా రేపటి నుంచి ఏడో తేదీ వరకూ నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ రాష్ట్రస్థాయి పోటీలకు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఏఆర్ పోలీస్ గ్రౌండ్స్ మైదానం, కల్యాణి డ్యాం పోలీస్ శిక్షణా కళాశాలల వేదికగా పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు అన్ని జిల్లాల నుంచి పోలీసు సిబ్బంది తరలిరానున్నారు. కంప్యూటర్ అవగాహన, డాగ్ స్క్వాడ్, ఫొటోగ్రఫీ, పొట్రేట్ పార్లే, ఫింగర్ ప్రింట్, ఐఓ ఫోటోగ్రఫీ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
యువ ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో..
పోటీల నిర్వహణ కోసం కొంతమంది యువ ఐపీఎస్ అధికారులను పోలీస్ శాఖ ప్రత్యేకంగా నియమించింది. గ్రేహౌండ్స్లో అసాల్ట్ కమాండర్స్గా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు ఐపీఎస్ అధికారులు... ఏర్పాట్లన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పోటీలతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు పోలీస్ శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందులో భాగంగా సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి కోసం ఐఐటీ తిరుపతి, ఐసర్ తిరుపతి, శ్రీసిటీ ట్రిపుల్ ఐటీలతో... పోలీస్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకోనుంది. మహిళాభద్రత, సైబర్ నేరాలపై అవగాహన తదితర అంశాలపై సింపోజియం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
పర్యవేక్షించిన ఉన్నతాధికారులు
పోలీసు ఉన్నతాధికారులు ఐజీ కాంతారావు, అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణాటాటా, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్రెడ్డి, చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్... డ్యూటీమీట్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆక్టోపస్, స్వాట్ కమాండోల బృందాలు రిహార్సల్స్ ప్రారంభించాయి. తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరాలు జరిగే తీరుపై అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు. పోలీస్ డ్యూటీమీట్ను విజయవంతం చేసేందుకు తిరుపతిలోని పలు స్వచ్ఛందసంస్థలు, పాఠశాలలు, కళాశాల బాగస్వామ్యాన్ని పోలీసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: