కర్నూలు జిల్లాలో మంచి వర్షాలు కురవటంతో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. 45 వేల ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. ఎకరానికి రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు ఖర్చు పెట్టారు. మంచి దిగుబడులు వస్తే ఎకరానికి సుమారు వంద క్వింటాళ్ల వరకు పంట వస్తుంది. అయితే గత నెల కురిసిన వర్షాల కారణంగా ఎకరానికి 50 క్వింటాళ్లు కూడా రాలేదు. మరోవైపు ఉల్లిగడ్డల్లో నాణ్యత లోపించటం, తేమ శాతం ఎక్కువగా ఉన్నందున మంచి ధర రావటం లేదు. దీనికితోడు కూలీలు, రవాణా ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి వంద రూపాయలు పలుకుతున్నా... తమకు కిలోకు రూ. 30లు రావడం లేదని రైతులు వాపోతున్నారు.
ప్రస్తుతం కర్నూలు మార్కెట్కు తక్కువగానే సరకు వస్తోంది. మార్కెట్లో ఉల్లిగడ్డల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అయినా రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదు. సరాసరిన రోజుకు 5 వందల క్వింటాళ్ల ఉల్లి వస్తోంది. కనిష్ఠ ధర రూ. 2 వేలు, గరిష్ఠ ధర రూ. 3,800, సరాసరి ధర రూ. 3 వేల వరకు పలుకుతోంది. మంచి నాణ్యమైన ఉల్లి గడ్డకు కిలోకు రూ. 30 వరకు ధర పలుకుతోంది.
ఇప్పటికీ బహిరంగ మార్కెట్లో ఉల్లికి మంచి గిరాకీ ఉంది. అయినా కర్నూలు ఉల్లికి ఎందుకు డిమాండ్ రావటం లేదో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
ఇవీ చదవండి..