వైద్యో నారాయణో హరిః అన్నారు. కరోనా సమయంలో సేవలందిస్తున్న డాక్టర్లు ఆ ఆర్యోక్తిని మరోసారి నిజం చేశారు. చికిత్స చేసే క్రమంలో అనేక మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. వ్యాధి నుంచి కోలుకుని మళ్లీ సేవలందిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది సుమారు 400 మంది వరకు కరోనా బారినపడ్డారు. ప్రైవేటు వైద్యుల్లోనూ చాలామందికి కరోనా వైరస్ సోకింది. కొందరు ప్రాణాలూ కోల్పోయారు. కరోనా వార్డుల్లో విధులు నిర్వహిస్తున్నంతసేపు పీపీఈ కిట్లు ధరించే ఉండాలి. ఒకసారి పీపీఈ కిట్ వేసుకుంటే.. మంచినీళ్లు తాగడానికీ, మూత్రవిసర్జనకు వెళ్లడానికీ ఉండదు. విధులు ముగించుకుని ఇంటికెళ్లినా ఎవరినీ తాకకుండా భయంగానే గడపాలి. అయినా కర్తవ్యదీక్ష ముందు ఆ సమస్యలన్నీ చిన్నవిగానే భావించి ముందుకు కదులుతున్న పోరాట యోధుల్లో కొందరి కథలివీ..
ఈ భారతి.. ధైర్యానికి హారతి
![vandanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1_1508newsroom_1597451596_818.jpg)
డాక్టర్ భారతి... తిరుపతిలోని రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్. 61 ఏళ్ల వయసులోనూ కొవిడ్ రోగుల సేవలో అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. 600 మందికిపైగా రోగులకు చికిత్సను పర్యవేక్షించడం, మధ్యలో సమావేశాలతో ఆమెకు క్షణం తీరిక ఉండదు. భారతికి జులై 26న కరోనా సోకింది. వ్యాధి నయమయ్యాక ఈ నెల 9న మళ్లీ ఆమె విధుల్లో చేరారు. ‘‘మేం భయపడితే, దాని ప్రభావం రోగులపైనా పడుతుంది. జాగ్రత్తలు తీసుకుంటూనే చికిత్స అందించాల్సిన సమయం ఇది’ అని భారతి ధైర్యంగా చెబుతున్న మాటలు ఆచరణీయం.
సేవా రథానికి సారథి
![108 అంబులెన్స్ డ్రైవర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/2_1508newsroom_1597451596_93.jpg)
షేక్ షావలీది నెల్లూరు జిల్లా కావలి. 108 అంబులెన్స్ డ్రైవర్గా నాలుగు నెలల నుంచీ కొవిడ్ రోగుల్ని ఆస్పత్రికి తరలించే బాధ్యత నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు గత నెల 18న వైరస్ సోకింది. పదిరోజులపాటు చికిత్స పొందారు. ఈ నెల 10 నుంచి మళ్లీ విధుల్లో చేరారు. కొవిడ్ బాధితులకు సేవ చేస్తున్నానన్న తృప్తి ఉందంటున్నారాయన.
మా స్థైర్యం.. వారికి ధైర్యం
![vandanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3_1508newsroom_1597451596_18.jpg)
డాక్టర్ శ్రీనివాసరావు వయసు 49 ఏళ్లు. తిరుపతిలో సుమారు 1,100 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్న శ్రీనివాసం కొవిడ్ కేంద్రానికి ఆయన ఇన్ఛార్జి. ఆయనకు జులైలో కరోనా సోకింది. చికిత్స పొందాక మళ్లీ విధుల్లో చేరారు. ‘‘కొవిడ్ కేంద్రానికి ప్రతి రోజూ కొత్తగా 200 మంది వస్తున్నారు. మాకు ప్రమాదం ఉన్నా, ఇతరుల ప్రాణాలు కాపాడుతున్నామన్న తృప్తి ఉంది. వైద్యులు, సిబ్బంది అధైర్యపడకుండా విధులు నిర్వర్తించాల్సిన సమయం ఇది’’ అని ఆయన చెబుతున్న మాటలు వైద్యవృత్తిపై గౌరవాన్ని మరింత పెంచుతున్నాయి.
రోగల క్షేమమే పరమావధిగా..
![vandanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4_1508newsroom_1597451596_168.jpg)
సొంగా బిందు బ్యూలావర్మ (38) విజయవాడ జీజీహెచ్లో ఐదేళ్ల నుంచి నర్సుగా పనిచేస్తున్నారు. మార్చి నుంచి కొవిడ్ విధుల్లో ఉంటున్నారు. ఆమెకు జూన్లో కరోనా సోకింది. వ్యాధి నుంచి కోలుకుని విధుల్లో చేరారు. ‘‘గంటలకొద్దీ పీపీఈ కిట్లు ధరించి విధుల్లో ఉండడం ఇబ్బందే అయినా.. రోగుల క్షేమాన్ని చూడటం ముందు అవన్నీ మరచిపోతున్నాం. నాకు పాజిటివ్ వచ్చినప్పుడు జీజీహెచ్లోనే చికిత్స తీసుకుని కోలుకున్నాను. నా వల్ల కుటుంబసభ్యులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకోవడం పెద్ద సవాలుగా మారింది’’ అని తెలిపారు.
ఒత్తిడిలో వైద్యమే విజయం
డాక్టర్ విజయభాస్కర్ (53) అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో మత్తు వైద్యుడు.క్యాన్సర్ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స విభాగంలో నియమితులయ్యారు. జులై 1న ఒక గర్భిణికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో విజయభాస్కర్ మత్తు ఇంజక్షన్ చేశారు. ఆ గర్భిణికి కరోనా సోకి ైంది. విజయభాస్కర్కూ కరోనా అని తేలింది. జులై 28 వరకు ఐసొలేషన్లో ఉండి, వ్యాధి నుంచి బయటపడ్డ ఆయన మళ్లీ విధుల్లో చేరారు. ‘‘ఆ రోజు మేం ధైర్యంగా ఆమెకు శస్త్రచికిత్స చేశాం కాబట్టే తల్లీ, బిడ్డా క్షేమంగా బయటపడ్డారు. ఉదయం 9 నుంచి 2 గంటల వరకు నా డ్యూటీ సమయం. కానీ కరోనా వల్ల ఎప్పుడు అత్యవసరమైనా పరుగు పెట్టాల్సి వస్తోంది. ఒత్తిడి ఉన్నా, ఈ సంక్లిష్ట సమయంలో సేవలందించడంలో తృప్తి ఉంది’’ అని విజయభాస్కర్ పేర్కొన్నారు.
తొలి ప్లాస్మాదాత
గుంటూరు జీజీహెచ్లో భద్రతా విభాగంలో పనిచేస్తున్న మణికంఠకు కరోనా వైరస్ సోకింది. వ్యాధి నుంచి కోలుకుని విధుల్లో చేరారు. జీజీహెచ్లో ఈ నెల 11న ప్మాస్మా సేకరణ కేంద్రం ప్రారంభించగా, మొదట తానే ప్లాస్మా దానం చేసి శభాష్ అనిపించుకున్నారు.
క్రీడలు నేర్పిన పోరాటస్ఫూర్తి
కేజీహెచ్లో అనస్థీషియాలో డిప్లొమా చేసిన కె.నరేష్ (28) ప్రత్యేక నియాకాల్లో విశాఖలోని రాష్ట్ర కొవిడ్ ఆస్పత్రి విమ్స్లో అనస్థీషియా టెక్నీషియన్గా చేరారు. ఈ నెల 31న కరోనా సోకింది. వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందడంతో వ్యాధి నయమైంది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో కోలుకుంటున్నారు. ‘‘నేను హాకీ క్రీడాకారుణ్ని. ఫిట్గా ఉంటాను. సోమవారం నుంచి విధులకు వెళ్లి కొవిడ్ రోగులకు సేవలందిస్తాను’’ అని నరేష్ తెలిపారు.
ధైర్యం చెబుతూ.. స్థైర్యం నింపుతూ
అనంతపురం జిల్లాకు చెందిన వెంకటరమణ 108 అంబులెన్స్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. కొవిడ్ రోగుల్ని తరలించే అంబులెన్స్లో పనిచేస్తున్న ఆయనకు జులై 14న వైరస్ సోకింది. చికిత్స పొంది మళ్లీ విధుల్లో చేరారు. ‘‘కరోనా రోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారో నాకు వైరస్ సోకాక తెలిసింది. ఇప్పుడు నేనే రోగులకు ధైర్యం చెబుతున్నాను’ అన్నారు.
కరోనాపై పోలీసు విజయం
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ.. బందోబస్తు, భద్రత విధుల్లోనే కాదు.. కరోనాపై ముందుండి పోరాడటంలోనూ పోలీసులదీ క్రియాశీలక పాత్రే. ఆగస్టు మొదటి వారం వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా 3,600 మందికి పైగా పోలీసులు కరోనా బారినపడ్డారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మొక్కవోని ఆత్మస్థైర్యంతో 1,893 మంది ఆ మహమ్మారిని జయించి, తిరిగి విధుల్లో చేరారు. కరోనాను జయించి తిరిగి విధుల్లోకి వస్తున్న వారికి ఆయా పోలీసుస్టేషన్లలో సహచరులు ఘన స్వాగతం పలుకుతున్నారు.
కలం యోధుల పోరాట స్ఫూర్తి
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలోనూ సమాచార సేకరణ, ప్రజలకు వార్తలు అందించడంలో ముందుంటున్న పాత్రికేయులు అనేక మంది కొవిడ్ బారిన పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల మందికి వైరస్ సోకింది. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాధి నుంచి కోలుకున్నవారు ఎప్పట్లానే విధులు నిర్వర్తిస్తున్నారు.
పారిశుద్ధ్య కార్మికుల పాత్రా కీలకం
కరోనా నియంత్రణలో పారిశుద్ధ్య కార్మికులూ కీలకపాత్ర నిర్వహిస్తున్నారు. మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 మందికిపైగా కరోనా బారినపడ్డారు. వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడుతున్నాయి. భర్త మృతితో రోడ్డునపడ్డామని విశాఖలోని ఒక కార్మికుడి భార్య కన్నీరు మున్నీరయ్యారు.
మనోధైర్యం నింపడమే సవాల్
![vandanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5_1508newsroom_1597451596_795.jpg)
డా.మొజ్జాడ ధనుంజయ శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో శ్వాసకోశవ్యాధుల నిపుణుడు. రోజూ సుమారు 12 గంటల పాటు విధుల్లో ఉంటున్నారు. ‘‘కొవిడ్ రోగులకు చికిత్స ఒక్కటే సరిపోదు. వారిలో ధైర్యం నింపాల్సిన బాధ్యతా వైద్యులదే. కొందరు రోగులు వ్యాధి నయమై మళ్లీ ఇంటికి వెళతానా? అని అడుగుతుంటారు. వారిలో మనోస్థైర్యం పెంచి, వైద్యం చేయడమే పెద్ద సవాల్’’ అని పేర్కొన్నారు.
ఐసొలేషన్లో ఉండీ విధులు
![vandanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6_1508newsroom_1597451596_1011.jpg)
శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు డా.హరికిషన్ సుబ్రహ్మణ్యం విజయనగరంలోని జిల్లా కొవిడ్ ఆస్పత్రి ప్రత్యేకాధికారి. కరోనా రోగులకు చికిత్స చేసే క్రమంలో ఆయన కూడా వైరస్ బారినపడ్డారు. వ్యాధి నుంచి కోలుకుని మళ్లీ విధులకు హాజరవుతున్నారు. ఐసొలేషన్లో ఉన్నప్పుడూ ఫోన్లో అందుబాటులో ఉంటూ కరోనా రోగులకు చికిత్సను పర్యవేక్షించడం ఆయన వృత్తి నిబద్ధతకు నిదర్శనం.
కర్తవ్యం ముందు అన్నీ చిన్నవే
![vandanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7_1508newsroom_1597451596_263.jpg)
డా.టీఎస్ఎన్ ప్రకాష్ (58) విశాఖలోని కొవిడ్ ఆస్పత్రి విమ్స్లో ఐసీయూ, అనస్థీషియా విభాగాలకు ఇన్ఛార్జి. ఇక్కడ కొవిడ్ రోగుల కోసం ఆపరేషన్ థియేటర్ కూడా ప్రారంభించారు. కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణులు శస్త్రచికిత్స కోసం, ప్రమాదాల్లో గాయపడిన కొవిడ్ రోగులు అత్యవసర చికిత్స కోసం... నాలుగు జిల్లాల నుంచీ అక్కడికే వచ్చేవారు. ఐసీయూ, అనస్థీషియా ఇన్ఛార్జిగా రోజుకి 12 గంటలపాటు ఊపిరిసలపని పని. ‘‘ఎంత పీపీఈ కిట్లు ధరించినా రోజూ కొవిడ్ రోగుల్ని చూసేటప్పుడు ప్రమాదం పొంచే ఉంటుంది. ఇంటికెళ్లాక కుటుంబసభ్యులు దగ్గరకు రావడానికి జంకుతారు. అవన్నీ అధిగమిస్తూనే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం’’ అని తెలిపారు.
60 ఏళ్ల వయసులోనూ అదే స్ఫూర్తి
![vandanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8_1508newsroom_1597451596_426.jpg)
విజయవాడ జీజీహెచ్లో పల్మనాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్.గోపీచంద్ మొదటి నుంచీ కొవిడ్ రోగులకు సేవలందిస్తున్నారు. 60 ఏళ్ల వయసున్న ఆయనకు ఏప్రిల్లో కరోనా సోకింది. వ్యాధి నుంచి కోలుకుని మళ్లీ కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. ‘‘తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ నుంచి బయటపడడం సులభమే. భయంవల్లనే రోగులు మానసికంగా నలిగిపోతున్నారు. ఐసీయూల్లో ఉన్న వారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని ఆయన తెలిపారు.
నవతరపు నారాయణుడు
![vandanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10_1508newsroom_1597451596_862.jpg)
చంద్రగిరి ప్రణయ్సాయి కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో పల్మనాలజీ పీజీ రెండో సంవత్సరం విద్యార్థి. కాకినాడలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. జులై 10న కరోనా బారిన పడినా కోలుకుని మళ్లీ విధుల్లో చేరారు. ‘‘వైరస్ సోకినా నయమవగానే మళ్లీ విధుల్లో చేరాను. కరోనా రోగులకు చికిత్స చేయడంలో తృప్తి ఉంది’’ అని చెబుతున్న ప్రణయ్ రాబోయే తరానికి కాబోయే వైద్యనారాయణుడే.
అన్నీ తామై.. అమ్మకు మరో రూపమై
![vandanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11_1508newsroom_1597451596_392.jpg)
డి.లక్ష్మి విశాఖలోని స్టేట్ కొవిడ్ ఆస్పత్రి విమ్స్లో ఇన్ఛార్జి నర్సింగ్ సూపరింటెండెంట్. విమ్స్లో 380 మంది నర్సులను పర్యవేక్షించే బాధ్యత ఆమెదే. ‘‘కరోనా రోగులకు చికిత్స చేయడంలో ప్రమాదం పొంచి ఉన్నా, దానికి మించిన తృప్తి కూడా ఉంది. మిగతా రోగుల పక్కన వారి కుటుంబసభ్యులో, సన్నిహితులో సహాయకులుగా ఉంటారు. కరోనా రోగులకు అన్నీ మేమే చూసుకోవాలి. రోగులకు చికిత్స చేసే క్రమంలో మా నర్సుల్లో ఐదారుగురు కరోనా బారినపడ్డారు. కోలుకుని మళ్లీ విధుల్లో చేరారు’’ అని లక్ష్మి వివరించారు.
ఇవీ చదవండి: ఎస్పీ బాలుకు అస్వస్థత- ఐసీయూలో చికిత్స